విరాట్ కోహ్లీ కాదు, ఇప్పుడు వారిద్దరిపైనే ఫోకస్ అంతా... జహీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది. టైటిల్ ఫెవరెట్గా భారీ అంచనాలతో బరిలో దిగి, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, ప్లేఆఫ్స్కి అర్హత సాధించలేకపోయింది. ఈ ఓటమి భారాన్ని ఎక్కువగా మోసింది విరాట్ కోహ్లీయే...
పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచినా, సూర్యకుమార్ యాదవ్ పెద్దగా స్కోరు చేయలేకపోయినా... పాక్ బౌలర్లకు అడ్డుగా నిలిచి పోరాడాడు విరాట్ కోహ్లీ...
కోహ్లీ హాఫ్ సెంచరీ కారణంగానే మొదటి మ్యాచ్లో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 151 పరుగుల బాధ్యతాయుతమైన స్కోరు చేయగలిగింది...
అయితే భారత బౌలర్లు విఫలం కావడంతో పాక్ ఆ స్కోరును తేలిగ్గా ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో పెద్దగా ట్రోల్స్ వినిపించలేదు. అయితే న్యూజిలాండ్తో మ్యాచ్లో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు..
అంతే దొరికిన అవకాశాన్ని వాడుకున్న విమర్శకులు, విరాట్ కోహ్లీని, అతని కెప్టెన్సీని పనికి రానిదిగా తేల్చేస్తూ ట్రోల్స్తో చీల్చి చెండాడేశారు. ఇప్పుడే కాదు, టీమిండియా కీలక మ్యాచుల్లో ఓడిన ప్రతీసారీ విమర్శలను ఎదుర్కొన్నది విరాట్ కోహ్లీయే...
‘సెమీ ఫైనల్స్కి కూడా అర్హత సాధించలేకపోయినందుకు భారత జట్టు చాలా నిరుత్సాహపడి ఉండొచ్చు. కచ్ఛితంగా న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో ఈ ఓటమి గురించి చర్చకు వస్తుంది...
అయితే న్యూజిలాండ్ సిరీస్ నుంచి భారత క్రికెట్లో కొత్త శకం మొదలు కానుంది. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఎలా జట్టును నడిపిస్తారేనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు....
ఈ సిరీస్లో ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే ఉంటుంది. ఈ ఇద్దరు ఎలాంటి ఎత్తులు వేస్తారు, ఎలాంటి ప్రణాళికలు రచిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్...
భారత ఉపఖండ పిచ్లపై న్యూజిలాండ్కి ఏమంత మెరుగైన రికార్డు లేదు. స్వదేశంలో ఇండియాతో జరిగిన సిరీస్ను నెగ్గినంత ఈజీగా భారత పిచ్లపై విజయం అందుకోలేదు కివీస్...
అయితే టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, అంతకుముందు భారత జట్టును ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడించి, టైటిల్ సాధించిన జోరులో ఉంది...
నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు జైపూర్ చేరుకున్నాయి. ఈ టూర్లో న్యూజిలాండ్ మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది.