మళ్లీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ! ఐదో టెస్టుకి కెప్టెన్సీ చేయాలని డిమాండ్ చేస్తున్న అభిమానులు...
టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడి, ఆ తర్వాత కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే ఐదో టెస్టుకి ముందు రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో విరాట్ కోహ్లీని కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...
టీమిండియా తరుపున మాత్రమే కాకుండా ఆల్టైం గ్రేట్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. 40 టెస్టు విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, మరో ఏడాది కెప్టెన్గా కొనసాగి ఉంటే ఈజీగా అత్యధిక విజయాలు అందుకున్న టెస్టు సారథిగా గ్రేమ్ స్మిత్ 53 విజయాల రికార్డును అధిగమించి టాప్ పొజిషన్లో నిలిచేవాడే..
బీసీసీఐతో విభేదాల కారణంగా కేప్టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ.. ఈ నిర్ణయం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులు ఆడాడు విరాట్...
ఇంగ్లాండ్ టూర్ 2021లోనూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు, ఆతిథ్య జట్టుపై తిరుగులేని ఆధిపత్యం చూపించింది. ఒక్క లీడ్స్ టెస్టు ఓటమి మినహా మిగిలిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా ఆధిపత్యమే సాగింది. నాటింగ్హమ్లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు, లార్డ్స్ మైదానంలో చారిత్రక విజయాన్ని అందుకుంది..
ఇంగ్లాండ్ టూర్లో విరాట్ కోహ్లీ టీమ్ని నడిపించిన విధానం క్రికెట్ ఫ్యాన్స్ని మాత్రమే కాదు, విమర్శకులను కూడా మెప్పించింది. ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఈ టెస్టు మ్యాచ్కి విరాట్ కోహ్లీని కెప్టెన్గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్...
ఇంగ్లాండ్ టూర్లో జరిగిన మొదటి నాలుగు టెస్టులకు విరాట్ కోహ్లీయే కెప్టెన్గా వ్యవహరించాడు, టీమ్ని 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. కాబట్టి ఆఖరి టెస్టుకి అతన్ని సారథిగా చేస్తేనే న్యాయంగా ఉంటుందని అంటున్నారు...
అయితే బీసీసీఐ తీరుతో తీవ్ర మనస్థాపం చెంది, మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ... ఈ ఐదో టెస్టుకి కెప్టెన్గా వ్యవహరించడానికి ఒప్పుకుంటాడా? అనేది అనుమానంగానే మారింది...
ఐదో టెస్టు ఆరంభానికి ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. కరోనా బారిన పడిన రోహిత్ శర్మ ఆలోపు కోలుకుంటాడనే టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ రోహిత్ కోలుకోకపోతే జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాని నడిపించే అవకాశం ఉంది..
కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టుల్లో 40 విజయాలు, 17 పరాజయాలు అందుకోగా 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. విదేశాల్లో 16, స్వదేశంలో 24 విజయాలు దక్కాయి. ధోనీ 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.