రోహిత్ కంటే హర్ధిక్ పాండ్యా చాలా బెటర్... టీమిండియా చరిత్రలోనే అత్యంత దారుణంగా...
ముంబైలో జరిగిన తొలి వన్డేలో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది భారత జట్టు. వైజాగ్లో జరిగిన రెండో వన్డేలో మాత్రం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో ఆల్రౌండ్ ఫెయిల్యూర్ మూటకట్టుకుంది...
Image credit: PTI
టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియాకి బంతుల వారీగా ఇది భారీ ఓటమి. వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి చెత్త ఓటమి...
ఆస్ట్రేలియా, పసికూన యూఎస్ఏతో జరిగిన వన్డే మ్యాచ్ని ఓ వికెట్ కోల్పోయి 253 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగా టీమిండియాతో వైజాగ్ వన్డేని 10 వికెట్ల తేడాతో 234 బంతులు మిగిలి ఉండగానే గెలిచి చూపించింది... భారత క్రికెట్ వన్డే చరిత్రలో 200లకు పైగా బంతులు మిగిలి ఉండగా ఓడడం ఇది రెండోసారి...
ఇంతకుముందు 2019లో న్యూజిలాండ్ టూర్లో హామిల్టన్ వన్డేలో 212 (14.4 ఓవర్లలో) బంతులు మిగిలి ఉండగానే ఓడింది టీమిండియా. ఇప్పుడు 234 బంతులు (11 ఓవర్లు) ఉండగానే మ్యాచ్ని ముగించింది ఆసీస్. ఈ రెండు వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ కావడం మరో విశేషం...
2023లో శ్రీలంకతో వన్డే మ్యాచ్లో 317 పరుగుల తేడాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్న రోహిత్ సేన, రెండు నెలల తేడాతో అతి చెత్త ఓటమిని మూటకట్టుకుంది... వరుసగా నాలుగో ఏడాదిలో 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా...
2020లో ఆస్ట్రేలియాతో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్లో పాక్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది. ఈ రెండూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాగా 2022లో టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో సెమీస్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత్, ఆస్ట్రేలియాతో వన్డేలో వికెట్ తీయలేక పరాజయం పాలైంది...
ఈ ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిచ్ బాగోలేదని ఎన్ని రకాల కామెంట్లు చెప్పినా... తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ... నేటి మ్యాచ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించామని సంతోషించేలోపే... వన్డేల్లో దారుణమైన పరాభవాన్ని మూటకట్టుకుంది టీమిండియా. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న భారత జట్టుకి ఇది హెచ్చరిక లాంటి మ్యాచ్ అంటున్నారు నెటిజన్లు...
అయితే 2010లో శ్రీలంకపై మ్యాచ్లో 209 బంతులు మిగిలి ఉండగానే ఓడింది భారత జట్టు. ఆ తర్వాత 8 నెలలకు టీమిండియా, వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దీంతో ఈ ఓటమి కూడా వచ్చే వరల్డ్ కప్ విజయానికి సంకేతం అంటున్నారు మరికొందరు రోహిత్ శర్మ అభిమానులు..