శ్రీకర్ భరత్ అరుదైన రికార్డు... టెస్టుల్లో రెండో తెలుగు వికెట్ కీపింగ్ బ్యాటర్గా వైజాగ్ కుర్రాడు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో నాగ్పూర్ టెస్టు ద్వారా కోన శ్రీకర్ భరత్కి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కింది. గత ఏడాది ఇంగ్లాండ్ టూర్కి ముందు వృద్ధిమాన్ సాహా కరోనా పాజిటివ్గా తేలడంతో శ్రీకర్ భరత్కి పిలుపునిచ్చింది బీసీసీఐ...
లండన్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు రోజు వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో 13 రోజుల పాటు బీసీసీఐ క్యాంపులో ఉన్న శ్రీకర్ భరత్... నిరాశగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే సాహా ఫెయిల్ కావడంతో కెఎస్ భరత్, టెస్టు టీమ్తో రిజర్వు వికెట్ కీపర్గా ఉంటున్నాడు...
KS Bharat
నవంబర్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో వృద్ధిమాన్ సాహా గాయపడడంతో అతని ప్లేస్లో శ్రీకర్ భరత్, వికెట్ కీపింగ్ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్ సమయానికి సాహా కోలుకోవడంతో భరత్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు..
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో శ్రీకర్ భరత్కి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కింది. టీమిండియా తరుపున టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేసిన రెండో ఆంధ్రా ప్లేయర్గా నిలిచాడు భరత్...
ఇంతకుముందు గుంటూరు జిల్లాకి చెందిన ఎమ్మెస్కే ప్రసాద్... టీమిండియా తరుపున 6 టెస్టులకు, 17 వన్డేలకు వికెట్ కీపింగ్ చేశాడు. తన కెరీర్లో 15 టెస్టు క్యాచులు అందుకున్న మన్నవ శ్రీ కాంత్ ప్రసాద్, వన్డేల్లో 14 క్యాచులు, 7 స్టంపౌట్లు చేశాడు...
మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత భారత జట్టుకి టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేసిన ఆంధ్రా కీపర్ కెఎస్ భరత్. ఓవరాల్గా భారత జట్టుకి వికెట్ కీపింగ్ చేసిన మూడో తెలుగు ప్లేయర్ భరత్. ఇంతకుముందు హైదరాబాద్కి చెందిన పోచయ్య కృష్ణమూర్తి... టీమిండియా తరుపున 5 టెస్టులు, ఓ వన్డే ఆడాడు...
పేలవ ఫామ్తో మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియా కీ ప్లేయర్గా మారాడు రిషబ్ పంత్. ఇప్పుడు అలాంటి అవకాశమే శ్రీకర్ భరత్కి దక్కింది. దీంతో ఈ వైజాగ్ కుర్రాడు ఎలా వాడుకుంటాడో చూడాలి..