- Home
- Sports
- Cricket
- ఇప్పటికైతే లేదు.. మున్నుందు చెప్పలేం..! ప్రేక్షకుల్లేకుండానే ఇండియా-సౌతాఫ్రికా సిరీస్..? అభిమానులకు నిరాశ
ఇప్పటికైతే లేదు.. మున్నుందు చెప్పలేం..! ప్రేక్షకుల్లేకుండానే ఇండియా-సౌతాఫ్రికా సిరీస్..? అభిమానులకు నిరాశ
India Tour Of South Africa: ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో కోరలు చాస్తున్నది. అక్కడ రోజురోజుకు కరోనా కేసుల్లో పెరుగుదల భారీగా ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26 నుంచి మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ను గెలవని టీమిండియా.. ఈసారి దానిని దక్కించుకోవడానికి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది.
భీకరమైన పేస్ బౌలింగ్ పిచ్ లపై భారత బ్యాటర్ల విన్యాసాలను చూద్దామనుకున్న అభిమానులకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు బ్యాడ్ న్యూస్ చెప్పింది. బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26) ను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్నారు.
తొలి టెస్టుతో పాట జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కూడా ఇప్పటిదాకా టికెట్ల విక్రయం ప్రారంభించలేదు. రెండో టెస్టుకు కూడా అభిమానులను అనుమతించేది కష్టమే అంటున్నాయి దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు.
‘దయచేసి గమనించండి.. రెండో టెస్టుకు సంబంధించి టికెట్ల అమ్మకాలపై ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తారా..? లేదా..? అనే విషయమై స్పష్టత లేదు.
ఈ విషయంపై నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’ అని క్రికెట్ సౌతాఫ్రికా వర్గాలు తెలిపాయి. తొలి టెస్టులో ఇరు బోర్డుల అధికారులు, కొద్ది మంది అభిమానులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నట్టు తెలుస్తున్నది.
దక్షిణాఫ్రికాలోనే గుర్తించిన ఒమిక్రాన్ కేసులు అక్కడ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి రప్పించి ఇంకా కరోనాను వ్యాపించడం కంటే ఖాళీ మైదానాల్లోనే టెస్టును నిర్వహించడం బెటరని బోర్డు భావిస్తున్నది.
అయితే తొలి టెస్టు ప్రారంభానికి మరో 6 రోజులు సమయం ఉండటంతో ఈ విషయంలో దక్షిణాఫ్రికా బోర్డు తన మనసు మార్చుకోకపోతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలాఉండగా తొలి టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్ లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. రెండేండ్లుగా శతకం లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీతో పాటు ఫామ్ లో లేని అజింకా రహానే, పుజారా లు రోజంతా ప్రాక్టీస్ లోనే గడుపుతున్నారు. రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశనంలో టీమిండియా ప్రాక్టీస్ లో జోరు పెంచింది.