ఐర్లాండ్ టూర్కు భారత్.. షెడ్యూల్ విడుదల.. ఆసియా కప్ ముందు మరో టీ20 సిరీస్
BCCI: విండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. అమెరికా నుంచి నేరుగా ఐర్లాండ్ కు వెళ్లనుంది.

ఆసియా కప్కు ముందు భారత్ రెండు దేశాల పర్యటనకు వెళ్లనుంది. ఇదివరకే వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ విడుదలవగా తాజాగా ఆగస్టులో భారత్.. ఐర్లాండ్ పర్యటనకు కూడా వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ టూర్ లో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది.
జులై మొదటివారంలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ కరేబియన్ టీమ్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. ఆగస్టు 13న ఈ సిరీస్ ముగియనుంది.
విండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. అమెరికా నుంచి నేరుగా ఐర్లాండ్ కు వెళ్లనుంది. ఐర్లాండ్ తో ఆగస్టు 18, 20, 23 న మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో టూర్ వివరాలను పంచుకుంది. ఈ మ్యాచ్ లన్నీ డబ్లిన్ వేదికగా జరుగుతాయి.
2022 లో కూడా భారత జట్టు జులై - ఆగస్టులలో ఇంగ్లాండ్ టూర్ జరుగుతుండగానే హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 టీమ్.. ఐర్లాండ్ తో ఇదే డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడి రెండూ గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ అదే వేదికగా ఐర్లాండ్ తో తలపడనుంది.
ఐర్లాండ్ తో టూర్ ముగిశాక భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది. ఆసియా కప్ కు సంబంధించిన తుది షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ ఆగస్టు చివరివారం నుంచి సెప్టెంబర్ రెండో వారం దాకా ఈ టోర్నీ జరుగనుంది. పాకిస్తాన్, శ్రీలంకలలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. భారత్ ఆడే మ్యాచ్ లు శ్రీలంకలోనే ఉన్నాయి.
ఇక ఆసియా కప్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ లోనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో కూడా మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ఉన్నా అది ఇంకా తుది రూపు దాల్చలేదు. అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్.. వన్డే ఫార్మాట్ పైనే అధికంగా ఫోకస్ చేసింది.