Rohit Sharma: తొక్కలో రెండు మ్యాచ్లు ఓడినందుకు కొంప మునిగిందా..? మాకు ఇవన్నీ కామన్ : రోహిత్ శర్మ
Asia Cup 2022: ఆసియా కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన బారత జట్టు ఈసారి ఫైనల్ కూడా చేరకుండానే సూపర్-4లోనే నిష్క్రమించింది. అయితే టోర్నీలో వరుస ఓటములపై భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్పందించాడు.
ఆసియా కప్-2022లో భాగంగా సూపర్-4లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత జట్టు తీవ్ర నిరాశలో ఉందా..? ఈ ఓటమి ప్రభావం రాబోయే టీ20 ప్రపంచకప్ మీద పడుతుందా..? అని టీమిండియా అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కానీ జట్టు సారథి రోహిత్ శర్మ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన అభిప్రాయంతో ఉన్నాడు.
అసలు ఆసియా కప్ లో ఓడినందుకు తమకు పెద్దగా ఆందోళన లేదని, ఇదసలు అంత ప్రాధాన్యమివ్వాల్సిన టోర్నీయే కాదన్నట్టుగా చెప్పాడు. శ్రీలంకతో మ్యాచ్ ముగిశాక పాత్రికేయుల సమావేశానికి వచ్చిన హిట్ మ్యాన్.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రోహిత్ మాట్లాడుతూ... ‘గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత మేం చాలా మ్యాచులు ఆడుతున్నాం. ఇప్పుడు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయాం. అదేం పెద్ద ఇష్యూ కాదు. అసలు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఈ ఓటముల గురించి పెద్దగా పట్టించుకోం. మాకు ఇవన్నీ కామన్...’ అని చెప్పాడు.
అంతేగాక.. ‘మేం మ్యాచులు ఓడిన తర్వాత మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు. బయిట మాట్లాడేవాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఇవన్నీ ఊహాజనిత విషయాలు. అయితే మేం వాటి గురించి ఆలోచించడం లేదు. మావరకైతే ఆటగాళ్లంతా రిలాక్స్డ్ గా ఉన్నారు..’ అని తెలిపాడు.
Image credit: PTI
ఇక భువనేశ్వర్ వరుసగా రెండు మ్యాచులలో చివరి ఓవర్లలో భారీగా పరుగులివ్వడం గురించి రోహిత్ స్పందిస్తూ.. ‘భువీ చాలాకాలంగా ఇండియాకు ఆడుతున్నాడు. డెత్ ఓవర్స్ లో అతడెంత కీలక బౌలర్ అనేది అందరికీ తెలుసు. ఒకటి, రెండు మ్యాచులలో సరిగా బౌలింగ్ చేయలేదని భువీని నిందించడం సరికాదు..’ అని చెప్పాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో కీలక క్యాచ్ జారవిడిచి భారత ఓటమికి కారణమైన అర్ష్దీప్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘అందుకు అతడు కూడా చాలా నిరాశపడ్డాడు. కానీ అదే మ్యాచ్ లో చివరి ఓవర్ ఎంతో కాన్ఫిడెంట్ గా బౌలింగ్ చేశాడు. శ్రీలంకతో కూడా చివరి ఓవర్ అర్ష్దీప్ ఎలా బౌలింగ్ చేశాడో చూశాం కదా. అది అతడి మీద అతడికి ఉన్న విశ్వాసం..’ అని అన్నాడు.