సీనియర్లు కుమ్మేశారు... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ విజేత ఇండియా లెజెండ్స్...
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 టైటిల్ను ఇండియా లెజెండ్స్ కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఫైనల్ ఫైట్లో 14 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్కి విజయం దక్కింది...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 10 పరుగులు చేసి అవుట్ కాగా బద్రీనాథ్ 7 పరుగులు చేశాడు...
సచిన్ టెండూల్కర్ 23 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు, యూసఫ్ పఠాన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేశారు...
182 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన శ్రీలంక లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులకి పరిమితమైంది...
తిలకరత్నే దిల్షాన్ 21, సనత్ జయసూర్య 43 పరుగులు చేయడంతో ఒకనాక దశలో 7.2 ఓవర్లలో 62 పరుగులు చేసింది శ్రీలంక లజెండ్స్. అయితే ఈ ఇద్దరినీ అవుట్ చేసిన యూసఫ్ పఠాన్, మ్యాచ్ను మలుపు తిప్పాడు.
ఆ తర్వాత చమర సిల్వ, ఉపుల్ తరంగ యూసఫ్ పఠాన్ బౌలింగ్లో అవుట్ కాగా చితక జయసింగే 30 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 40 పరుగులు, కౌశల్య వీరరత్నే 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశారు.
అయితే వీరరత్నే, గోనీ బౌలింగ్లో అవుట్ కాగా జయసింగే రనౌట్ కావడంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. ఆఖరి ఓవర్కి 24 పరుగులు కావాల్సిన దశలో 9 పరుగులే రాబట్టిన శ్రీలంక లెజెండ్స్, ఆఖరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది.
2011 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా చేతుల్లో ఓడిన శ్రీలంక జట్టులోని సభ్యుల్లో చాలామంది, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచులోనూ ఆడడం, అక్కడా ఇక్కడా భారత జట్టుకే విజయం దక్కడం విశేషం.