భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు వ్యతిరేకంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు
IND VS PAK : పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడటాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. ఆసియా కప్ సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్ కు ముందు ఆప్ నేతలు నిరసనలు తెలిపారు.

ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు
ఆసియా కప్ 2025 సూపర్ పోరులో భారత్ పాకిస్తాన్ ఆదివారం తలపడుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో పలువురు నిరసనలు తెలిపారు. ఉప్పల్ స్టేడియం వద్ద నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఆమ్ ఆది పార్టీ నాయకులు ఉప్పల్ స్టేడియం వద్ద భారత్, పాక్ మ్యాచ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నియోజకవర్గం చీఫ్ సుధారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాక్ జెండా దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ట్యాంక్ బండ్ (లిబర్టీ) అండర్పాస్ వద్ద రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ నేతృత్వంలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.
పాకిస్తాన్ పై భారత్ దెబ్బ
ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. మరోసారి సూపర్ 4 లో భారత్ తో తలపడుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు మానసిక వికాస నిపుణుడు రహీల్ అహ్మద్ను పాకిస్తాన్ పిలిపించుకుంది. మ్యాచ్కు ముందురోజు ఆయన ఆటగాళ్లతో భేటీ అయ్యి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను వివరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి కూడా ఆటగాళ్లను కలసి మానసికంగా బలపరిచే ప్రయత్నం చేశారని సమాచారం.
భారత్-పాక్ మరోసారి బిగ్ ఫైట్
ఆసియా కప్లో ఇప్పటికే భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఇప్పుడు మరోసారి తలపడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుతుంది. మరోసారి పాక్ గట్టి షాక్ ఇవ్వాలని భారత్ గెలుపు వ్యూహాలతో సిద్ధంగా ఉంది.
భారత్ స్పందనపై పాక్ విమర్శలు
గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ పీసీబీ మ్యాచ్ రిఫరీపై ఫిర్యాదులు చేస్తూ వివాదాన్ని రగిలించింది. కానీ భారత జట్టు మాత్రం ప్రశాంతంగా వ్యవహరించింది. కెప్టెన్ సూర్యకుమార్ ‘‘ఇది మా కోసం పెద్ద పోరు కాదు, అభిమానులను అలరించడమే మా లక్ష్యం’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భారత జట్టు ఎప్పుడూ పాక్తో పోరును తక్కువ చేసి చూడదని అన్నారు.
పాక్పై గిల్ అదరగొడతాడా?
ఆసియా కప్ 2025 సూపర్-4లో పాకిస్థాన్తో తొలి మ్యాచ్కు ముందు భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. గత మ్యాచ్లలో పెద్దగా రాణించలేకపోన గిల్ ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారం రోజుల్లోనే మళ్లీ భారత్-పాక్ తలపడుతుండటంతో క్రికెట్ లవర్స్ కు పండగలా మారింది. లీగ్ మ్యాచ్ లో ఆధిపత్యం చలాయించిన భారత్ మళ్లీ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ గెలుపే టార్గెట్ అంటోంది. దీంతో క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.