- Home
- Sports
- Cricket
- IND vs PAK: ఆసియా కప్ ఫైనల్లో హైడ్రామా.. టీమిండియా తీసుకొని ట్రోఫీని ఏం చేస్తారు.?
IND vs PAK: ఆసియా కప్ ఫైనల్లో హైడ్రామా.. టీమిండియా తీసుకొని ట్రోఫీని ఏం చేస్తారు.?
IND vs PAK: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. తిలక్ వర్మ అద్భుత ఆటతీరుతో జట్టు విజయ తీరాలకు చేరింది. కాగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరారకరించింది. అసలు మ్యాచ్ తర్వాత స్టేడియంలో ఏం జరిగిందంటే.?

భారత్ ఘన విజయం డ్రెసింగ్ రూమ్లోనే పాక్ ఆటగాళ్లు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని సాధించింది. రింకు సింగ్, తిలక్ వర్మ జట్టుకు విజయాన్ని అందించారు. విజయం అనంతరం భారత్ ఆటగాళ్లు మైదానంలో సందడి చేస్తుండగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా జట్టు మాత్రం నేరుగా డ్రెస్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దాంతో బహుమతి ప్రదానోత్సవం గంట పాటు ఆలస్యమైంది.
ట్రోఫీపై భారత్-పాక్ వివాదం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్, పాక్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు నిరాకరించింది. ఈ విషయం తెలిసిన ACC అధికారులు చర్చలు జరిపారు. భారత జట్టు ట్రోఫీని ఎమిరేట్స్ బోర్డు వైస్ చైర్మన్ ఖాలిద్ అల్ జరూంని చేతిలో నుంచి తీసుకోవాలని కోరినా, ఆ అభ్యర్థనను తిరస్కరించారు.
రన్నరప్ చెక్ విసిరేసిన పాక్ కెప్టెన్
ప్రెజెంటేషన్ సమయంలో స్టేడియంలో “భారత్ మాతాకి జై” నినాదాలు వినిపించాయి. చివరికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం పాక్ ఆటగాళ్లకు రన్నరప్ మెడల్స్ ఇచ్చారు. అయితే రన్నరప్ చెక్కును అందుకున్న సల్మాన్ అలీ అఘా దానిని అందరి ముందు నేలపైకి విసిరేశాడు. ఈ సమయంలో అతిథులు, స్టేజ్పై ఉన్న వారు షాక్ అయ్యారు.
ట్రోఫీ లేకుండానే..
ACC నిర్ణయం వల్ల భారత జట్టుకు ట్రోఫీ అందలేదు. సమీక్ష తర్వాత ACC అధికారులు, నఖ్వీతో సహా, స్టేడియం విడిచిపెట్టారు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకపోయినా వేదికపైకి వచ్చి ఫోటోలు దిగారు. హార్దిక్ పాండ్యా ముందుగా సెల్ఫీ తీసుకోగా, సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్లుగా నటించి రోహిత్ శర్మ స్టైల్లో నడిచి అభిమానులను అలరించాడు. ప్రెస్ మీట్లో సూర్యకుమార్ మాట్లాడుతూ.. "ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ వ్యంగ్యంగా, “మాకు నిజమైన ట్రోఫీ దొరికింది – సూర్యా భాయ్ తీసుకొచ్చాడు!” అని అన్నాడు.
బీసీసీఐ తీవ్ర హెచ్చరిక
పాక్ కెప్టెన్ అఘా మాట్లాడుతూ, “ACC అధ్యక్షుడు నఖ్వీ మాత్రమే ట్రోఫీ ఇవ్వగలడు. మీరు ఆయన చేతిలో నుంచి తీసుకోవట్లేదంటే, ట్రోఫీ ఎలా దొరుకుతుంది?” అని భారత జట్టుపై విమర్శలు చేశాడు. అయితే భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా కఠినంగా స్పందిస్తూ.. "పాకిస్థాన్తో మనకు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నఖ్వీ చేతిలో నుంచి ట్రోఫీ స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ అందుకని ఆయన ట్రోఫీ, మెడల్స్ను దాచుకోవడం చాలా అవాంఛనీయమైనది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ వెంటనే భారత జట్టుకు ఇవ్వకపోతే, రాబోయే ICC కాన్ఫరెన్స్లో మేము బలమైన నిరసన తెలుపుతాం" అని హెచ్చరించారు.