- Home
- Sports
- Cricket
- IND vs NZ: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ.. 10 నెలల్లో రెండో ICC టైటిల్... భారత్ రికార్డు
IND vs NZ: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ.. 10 నెలల్లో రెండో ICC టైటిల్... భారత్ రికార్డు
IND vs NZ: 22 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Photo Credit : AFP
IND vs NZ champions trophy 2025: భారత జట్టు చరిత్ర సృష్టించింది. 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ను గెలుచుకుంది. దీంతో టీం ఇండియా ప్రపంచంలో మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లను గెలుచుకున్న తొలి జట్టుగా కూడా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రోహిత్ శర్మ నాయకత్వం లోని భారత జట్టు న్యూజిలాండ్ చిత్తు చేస్తూ 4 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగురవేసింది.
ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో, న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మంచి బ్యాటింగ్ కారణంగా, భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.
10 నెలల్లో రెండో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్
రోహిత్ కెప్టెన్సీలో, భారత జట్టు 10 నెలల్లో రెండవ ICC టైటిల్ను గెలుచుకుంది. జూన్ 2024లో, బార్బడోస్లో జరిగిన T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్లో ప్రత్యేకత ఏమిటంటే భారత జట్టును ఎవరూ ఓడించలేదు. ఈ ఐసీసీ ఈవెంట్లో భారత్ అజేయంగా నిలిచి ట్రోఫిని గెలిచింది. 2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో, 2013లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ట్రోఫీని అందుకుంది.
ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన జడేజా
ఈ మ్యాచ్ లో విన్నింగ్ పరుగులను భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కొట్టాడు. అద్భుతమైన 4 కొట్టి మ్యాచ్ ను మరో ఓవర్ మిగిలి వుండగానే గెలిపించారు. అలాగే, కెఎల్ రాహుల్తో అజేయ భాగస్వామ్యాన్ని పంచుకుని భారత్ను విజయపు అంచుకు తీసుకెళ్లాడు. కెఎల్ రాహుల్ 34 పరుగులతో అజేయంగా నిలవగా, జడేజా 6 బంతుల్లో 9 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు, శ్రేయాస్ అయ్యర్ (48 పరుగులు), అక్షర్ పటేల్ (29 పరుగులు) మధ్య నాల్గవ వికెట్ భాగస్వామ్యం భారత విజయానికి పునాది వేసింది.
రోహిత్-గిల్ సెంచరీ భాగస్వామ్యం
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ భారత్కు బలమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు. అయితే, శుభ్మన్ గిల్ (31 పరుగులు) అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ తడబడింది. రెండు బంతుల్లో 1 పరుగు చేసి విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. దీని తర్వాత కొద్దిసేపటికి రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు.
రోహిత్ 76 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అందులో హిట్ మ్యాన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. వీరు అవుట్ అయిన తర్వాత ఒకానొక సమయంలో ఈ మ్యాచ్లో భారత్ వెనుకబడినట్లు అనిపించింది, కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించడంతో భారత్ విజయం సాధించింది.
న్యూజిలాండ్ పోరాటం ఫలించలేదు
స్లో పిచ్పై భారత స్పిన్నర్లు మరోసారి అద్భుతంగా రాణించారు. డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63), మైఖేల్ బ్రేస్వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో, న్యూజిలాండ్ జట్టు 250 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగుల పోరాట స్కోరును నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది, కానీ భారత స్పిన్నర్ల చేతిలో 38 ఓవర్లలోనే మొదటి ఐదు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఈ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించడం ద్వారా, భారతదేశం 25 ఏళ్ల తర్వాత సరైన తీరులో న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలనే భారత కలను న్యూజిలాండ్ చెదరగొట్టింది. ఇప్పుడు టైటిల్ విజయంతో భారత జట్టు న్యూజిలాండ్ ను దెబ్బకొట్టింది.