ఆసీస్ టూర్లో టీమిండియా ఓడితే, కోహ్లీ కెప్టెన్సీ ఊడినట్టేనా... దాదా వార్నింగ్!
IPL 2020 సీజన్లోనూ విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నిరాశ తప్పలేదు. సీజన్ ఆరంభంలో అద్భుత ఆటతీరు కనబర్చిన ఆర్సీబీ, ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి టోర్నీ నుంచి నిష్కమించింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎనిమిది సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్గా వ్యవహారిస్తోన్న విరాట్ కోహ్లీ, ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...
టైటిల్ గెలవడానికి విరాట్కి ఇచ్చిన సమయం చాలా ఎక్కువని కోహ్లీని తీవ్రంగా విమర్శించాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...
తాజాగాఈ లిస్టులోకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయాడు. వచ్చే ఆసీస్ టూర్లో భారత జట్టు ఘోరంగా విఫలమైతే, కోహ్లీ కెప్టెన్సీకి ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చాడు దాదా.
కరోనా కారణంగా సుదీర్ఘ బ్రేక్ పడిన క్రికెట్ సీజన్ ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే, టీ20, టెస్టు సిరీస్లు ఆడనుంది భారత జట్టు.
మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ... భారత జట్టుకి టెస్టుల్లో అద్భుత విజయాలు అందించినా ఐసీసీ టోర్నీల్లో మాత్రం పెద్దగా విజయాలు అందించలేకపోయాడు.
2019 వన్డే వరల్డ్కప్లో కూడా సెమీఫైనల్లోనే ఓడి, స్వదేశం చేరింది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. దీంతో ఈసారి ఆసీస్ టూర్లో భారత జట్టు విఫలమైతే మాత్రం కోహ్లీని కెప్టెన్గా తొలగించాలని డిమాండ్లు విపరీతంగా పెరగవచ్చు.
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో భారత బౌలర్లను ఎలా వాడుకుంటాడనేదానిపైనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడిన సౌరవ్ గంగూలీ... మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలే విజయానికి కీలకమని చెప్పాడు.
బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీతో పాటు నవ్దీప్ సైనీ, సిరాజ్ వంటి పేసర్లతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టబోతోంది భారత జట్టు...వీరితో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు.
వీరిని ఆసీస్ గడ్డపై ఎలా ఉపయోగించుకుంటాడనేది కోహ్లీ ఇష్టమని చెప్పిన గంగూలీ... ఆసీస్ టూర్లో రాణించగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ను తుదిజట్టులోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా కెప్టెన్దేనని చెప్పాడు.
కొంతకాలంగా సరైనా ఫామ్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో కొన్ని మ్యాచుల్లో మెరిసినా, కీలకమైన మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై బ్యాటింగ్లో రాణిస్తేనే భారత జట్టు విజయాలు అందుకోగలదని అన్నాడు దాదా.
సౌరవ్ గంగూలీ మాటలను బట్టి చూస్తుంటే... ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు ఘోరంగా విఫలమైతే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు కొందరు విశ్లేషకులు...