నటరాజన్ ఎందుకు లేడు? శార్దూల్ ఠాకూర్ని తీసుకోవచ్చుగా... మూడో టెస్టు జట్టుపై ఫ్యాన్స్ నిరాశ...
ఎప్పటిలాగే టెస్టు ప్రారంభానికి ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించింది టీమిండియా. సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టుకి 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి రాగా, గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవ్దీప్ సైనీకి సిడ్నీ టెస్టులో చోటు దక్కింది. సైనీకి ఇది ఆరంగ్రేటం టెస్టు మ్యాచ్ కానుంది. అయితే ఈ జట్టుపై టీమిండియా అభిమానులు నిరాశ వ్యక్తపరుస్తున్నారు.
ఉమేశ్ యాదవ్ గాయపడడంతో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్, సిడ్నీ టెస్టు మ్యాచ్ ఆడతాడని అంతా భావించారు. అయితే అలా జరగలేదు...
నటరాజన్ కంటే ముందుగా టెస్టులకు ఎంపిక చేసిన బౌలర్ నవ్దీప్ సైనీకే ప్రాధాన్యం ఇచ్చింది టీమిండియా...
బౌన్స్, స్పీడ్ కలగలిసిన బౌలింగ్ వేసే నవ్దీప్ సైనీ, సిడ్నీ టెస్టులో మ్యాజిక్ చేస్తాడని భారత జట్టు ఆశిస్తోంది...
మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మహ్మద్ షమీ గాయపడితే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు, ఉమేశ్ యాదవ్ గాయపడితే నటరాజన్ను తీసుకున్నారు. వీరికంటే ముందు టెస్టు సిరీస్కి ఎంపికయ్యాడు నవ్దీప్ సైనీ. ఆ ఇద్దరికంటే సైనీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి... అతని ఎంపిక భారత జట్టుకి కలిసొస్తుంది’ అన్నాడు ఆశీష్ నెహ్రా.
అయితే అభిమానులు మాత్రం వన్డే, టీ20 మ్యాచుల్లో అదరగొట్టిన నటరాజన్, టెస్టు ఎంట్రీ చేస్తే బాగుంటుందని ఆశించారు. అతనికి చోటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు.
అలాగే ఆసీస్పై మంచి రికార్డు ఉన్న శార్దూల్ ఠాకూర్, సిడ్నీ టెస్టు ఆడడం ఖాయమని టాక్ వినిపించింది. స్వింగ్ బౌలింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్ ఉంటే ఆసీస్ను వణికించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దూకుడైన బౌలింగ్తో స్టీవ్ స్మిత్ను అవుట్ చేయడంతో శార్దూల్ ఠాకూర్ సమర్థుడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే నటరాజన్, శార్దూల్ ఠాకూర్లకు చోటు దక్కకపోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.
రోహిత్ శర్మ కోసం మయాంక్ అగర్వాల్ను తప్పించడంపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...
మయాంక్ అగర్వాల్ టెస్టు ఎంట్రీ చేసినప్పటి నుంచి అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు. 2018లో మెల్బోర్న్లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్, మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేశాడు.
అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్, ప్రతీ 5 ఇన్నింగ్స్లకి ఓసారి 50+ స్కోరు నమోదుచేశాడు.
న్యూజిలాండ్పై 2020 టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గానూ నిలిచిన మయాంక్ అగర్వాల్ను కేవలం రెండు టెస్టుల్లో విఫలమయ్యాడనే కారణంగా తప్పించడం సరికాదని అభిమానుల వాదన.