అప్పుడు ధోనీ చేసిన పని, ఇప్పుడు కోహ్లీ ఎందుకు చేయలేడు... దేశం కంటే ఎక్కువా?
IPL 2020 సీజన్ ముగిసింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరుస్తూ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఐపీఎల్ పూర్తికాగానే భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా టూర్కి బయలుదేరింది విరాట్ సారథ్యంలోని భారత జట్టు. అయితే సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే, విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం మొదలైంది.
నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇందులో ఓ డే-నైట్ టెస్టు కూడా ఉంది.
అయితే ఈ టూర్కి కెప్టెన్గా వ్యవహారిస్తున్న విరాట్ కోహ్లీ... టెస్టు సిరీస్ను మధ్యలోనే వదిలి స్వదేశం రానున్నాడు...
విరాట్ భార్య అనుష్క శర్మ జనవరి మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో పెటర్నిటీ లీవ్ ద్వారా మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం చేరుకోబోతున్నాడు విరాట్ కోహ్లీ.
కోహ్లీ లేకుండానే మిగిలిన మూడు టెస్టులు ఆడబోతోంది భారత జట్టు. ఈ టెస్టులకు వైస్ కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు. అయితే రోహిత్కి కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన కూడా ఉంది.
అయితే విరాట్ కోహ్లీ ఆసీస్ టూర్ని ఇంకా మొదలుపెట్టకముందే, అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు. దేశం కంటే వ్యక్తిగత జీవితం ఎక్కువైపోయిందా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
2015 వరల్డ్ కప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, తన కూతుర్ని చూసుకునేందుకు నెల రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.
మరి విరాట్ కోహ్లీ మాత్రం దేశానికి ఆడడం కంటే, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు. అయితే విరాట్ గురించి పూర్తిగా తెలిసినవాళ్లు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు.
టీనేజ్ వయసులోనే రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తండ్రి చనిపోయిన తర్వాతిరోజే బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ బాది తన జట్టుకి విజయాన్ని అందించాడు. అప్పుడు పంటి బిగువున బాధను ఆపుకుని క్రికెట్కి ప్రాధాన్యం ఇచ్చినవాడు, ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని కోరుకోవడంలో తప్పులేదని అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.
ధోనీకి బిడ్డ పుట్టిన సమయంలో వరల్డ్ కప్ కాకుండా మరేదైనా ద్వేపాక్షిక సిరీస్ ఉంటే... మాహీ కూడా కచ్ఛితంగా కూతుర్ని చూసుకునేందుకు వచ్చేవాడని అంటున్నారు మరికొందరు. ఆసీస్ టూర్ని వరల్డ్కప్తో పోల్చడం సరికాదని హితవు చేస్తున్నారు.
2017లో అనుష్క శర్మను వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ... బిజీ షెడ్యూల కారణంగా పెళ్లైన ఏడాది కేవలం 27 రోజులు మాత్రమే ఆమెతో కలిసి ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది విరుష్క జోడి.
అలాంటి ప్రొఫెషనల్ క్రికెటర్, ఈసారి పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాడంటే పుట్టబోయే బిడ్డ అతనికి ఎంత స్పెషల్ అనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు విరాట్ ఫ్యాన్స్.
చిన్నవయసులోనే దూరమైన తండ్రి, తనకి బిడ్డగా జన్మించబోతున్నాడని కోహ్లీ భావిస్తున్నాడని... అందుకే ఈ విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నాడని... ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని గుర్తించాలని అంటున్నారు అభిమానులు.
విరాట్ కోహ్లీ లేకుండా మూడు టెస్టులు ఆడబోతున్న భారత జట్టును ఓడించడం ఆస్ట్రేలియాకు పెద్ద కష్టం కాబోదని అంచనా వేస్తున్నారు క్రీడా పండితులు. క్రికెటర్ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ‘టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియాలో భారత జట్టు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు హర్షా బోగ్లే.