INDvsAUS: గిల్ అరుదైన రికార్డు... లంచ్ సమయానికి ఇంకా 105 పరుగుల దూరంలో..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. మొదటి టెస్టు ఆడుతున్న యంగ్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్ 45 పరుగులతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా... పూజారా 17 పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేయడం విశేషం.
36/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్, పూజారా... రెండో వికెట్కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
రెండో రోజు మొదటి బంతికే ఛతేశ్వర్ పూజారా అవుట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూకి కూడా వెళ్లింది. అయితే రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.
శుబ్మన్ గిల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను మరోసారి జారవిరిచారు ఆస్ట్రేలియా ఫీల్డర్లు. దీంతో రెండు సార్లు బతికిపోయిన శుబ్మన్ గిల్... 65 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో మొదటి మ్యాచ్ ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు శుబ్మన్ గిల్. ఇంతకుముందు 2018లో మయాంక్ అగర్వాల్ 76, 1947లో దత్తూ పడ్కర్ 51 పరుగులు చేశారు.
అయితే 45 పరుగులు చేసిన 21 ఏళ్ల శుబ్మన్ గిల్, అతి చిన్న వయసులో ఆస్ట్రేలియా ఆరంగ్రేటం చేస్తూ, అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు.
4 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్ను జారవిడిచిన టిమ్ పైన్... కమ్మిన్స్ బౌలింగ్లో అదిరే క్యాచ్ అందుకున్నాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే పూజారా కూడా అదే స్టైల్లో అవుట్ అయ్యాడు. 70 బంతుల్లో ఓ ఫోర్తో 17 పరుగులు చేసిన పూజారా.. కమ్మిన్స్ బౌలింగ్లో పైన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు హనుమ విహారి,కెప్టెన్ రహానే. రహానే 10, విహారి 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ సమయానికి 37 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది టీమిండియా...