INDvsAUS 1st Test: పృథ్వీషా డకౌట్... ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయినా జట్టులోకి వచ్చి...
INDvAUS: యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా...కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో ఎంట్రీతోనే సంచలన ప్రదర్శన ఇచ్చిన పృథ్వీషా... ఫ్యూచర్ సచిన్, ఫ్యూచర్ సెహ్వాగ్గా గుర్తింపు పొందాడు. అయితే రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ ఫెయిల్ అయిన పృథ్వీషా... మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు పృథ్వీషా. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. నిజానికి ప్రాక్టీస్ మ్యాచ్లో శుబ్మన్ గిల్ బాగా ఆడాడు. కానీ పృథ్వీషాకి అవకాశం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...
ఐపీఎల్ 2020 సీజన్లో పెద్దగా పర్ఫామెన్స్ కనబర్చని పృథ్వీషా... ఆస్ట్రేలియా టూర్లో టెస్టు సిరీస్కి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు.
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్లో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.....
రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో పర్వాలేదనిపించే ప్రదర్శన ఇచ్చిన పృథ్వీషా... మొదటి ఇన్నింగ్స్లో 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.
పృథ్వీషాతో పోలిస్తే శుబ్మన్ గిల్ కాస్త మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు. ఐపీఎల్లో కూడా క్లాస్ ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్న గిల్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిసి 100+ స్కోరు చేశాడు...
గిల్ ఆడిన విధానం క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. మొదటి టెస్టు మ్యాచ్లో గిల్కి ఓపెనర్గా అవకాశం ఇవ్వాలని సూచించారు చాలామంది మాజీ క్రికెటర్లు.
అయితే విరాట్ కోహ్లీ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్న యంగ్ బ్యాట్స్మెన్ పృథ్వీషాకే అవకాశం ఇచ్చాడు. ఫలితం మొదటి టెస్టు రెండో బంతికే వికెట్...
నిజానికి పృథ్వీషాకి అంతర్జాతీయ టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఈ టెస్టుకి ముందు మూడు టెస్టు మ్యాచులు ఆడిన పృథ్వీషా... ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు బాదాడు.
ఆడిలైడ్ టెస్టులో డకౌట్ కావడమే పృథ్వీషాకి అంతర్జాతీయ మ్యాచులో సింగిల్ డిజిట్ స్కోరు... ఈ రికార్డులే శుబ్మన్ గిల్ కంటే పృథ్వీషాని ఎంచుకోవడానికి కారణమయ్యాయి.
మరోవైపు రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ని పక్కనబెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది...
రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహాను తుది జట్టుకి ఎంచుకున్న కోహ్లీ, టెస్టుల్లో సాహా కంటే మంచి రికార్డున్న పంత్ని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
మరోవైపు మంచి ఫామ్లో ఉన్న కెఎల్ రాహుల్కి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలకి తుది జట్టులో చోటు కల్పించకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
అయితే రెండో టెస్టు నుంచి తన స్థానంలో కెఎల్ రాహుల్ని దింపాలనే ఆలోచనతోనే విరాట్ కోహ్లీ అతన్ని పక్కనబెట్టి, మయాంక్ అగర్వాల్కి అవకాశం ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు...
అదీకాకుండా మొదటి టెస్టులో కెఎల్ రాహుల్ కూడా విఫలమైతే జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. కాబట్టి రాహుల్ని పక్కనబెట్టి వ్యూహాత్మకంగా వ్యవహారించాడని అంటున్నారు.
టెస్టుల్లో సున్నాకే తొలి వికెట్ కోల్పోవడం టీమిండియాకి ఇది మూడో సారి. ఇంతకుముందు 1981లో సిడ్నీలో ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయిన టీమిండియా, 2007లో బంగ్లాదేశ్పై కూడా సున్నాకే వికెట్ కోల్పోయింది.