ఐపీఎల్ 2023లో కొత్త రూల్... మ్యాచ్ మధ్యలో టీమ్లోకి ‘ఇంపాక్ట్ ప్లేయర్’...
ఐపీఎల్ 2022 సీజన్కి అనుకున్నంత రేటింగ్ అయితే రాలేదు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి భారీ సినిమాల ప్రభావం, ఐపీఎల్పై తీవ్రంగా పడింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కొత్త రూల్ తీసుకొచ్చింది బీసీసీఐ...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది బీసీసీఐ. ఈ నిబంధన ప్రకారం ప్రతీ జట్టు, నలుగురు ప్లేయర్లను సబ్స్టిట్యూట్స్గా ప్రకటించాలి.14 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వీరిలో ఒకరిని ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తుదిజట్టులోకి తీసుకోవచ్చు...
ఉదాహరణకి తుది జట్టులో ఉన్న రవీంద్ర జడేజా భారీగా పరుగులు ఇస్తున్నాడంటే 14వ ఓవర్ ముగిసిన తర్వాత జడ్డూ ప్లేస్లో టీమ్లో లేని అక్షర్ పటేల్ లేదా యజ్వేంద్ర చాహాల్లను తీసుకోవచ్చు... అలాగే బ్యాటింగ్ చేస్తున్న టీమ్ కూడా సబ్స్టిట్యూట్ని వాడొచ్చు.
Image credit: PTI
ఈ రూల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2022 టోర్నీలో దీన్ని ప్రయోగించి, అక్కడ సక్సెస్ అయితే ఐపీఎల్ 2023 సీజన్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది భారత క్రికెట్ బోర్డు...
కబడ్డీ, ఫుట్బాల్, రగ్భీ వంటి ఆటల్లో ఈ సబ్స్టిట్యూట్ విధానం ఉంటుంది. అయితే క్రికెట్లో మాత్రం ఏ ప్లేయర్ అయినా గాయపడితేనే అతని స్థానంలో మరో ప్లేయర్ని కంకూషన్ సబ్స్టిట్యూట్గా ఆడేందుకు అనుమతిస్తూ రెండేళ్ల క్రితమే వెసులుబాటు తీసుకొచ్చింది ఐసీసీ...
Image credit: PTI
‘దేశవాళీ టీ20 టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ప్రవేశపెడుతున్నాం. ఈ రూల్ ప్రతీ టీమ్ ఓ సబ్స్టిట్యూట్ ప్లేయర్ని వాడేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఈ ఫార్మాట్కి వ్యూహాత్మక, ప్రణాళికబద్ధమైన డైమెన్షన్ని జోడిస్తుంది. ఫుట్బాల్, రగ్భీ, బాస్కెట్బాల్, బేస్ బాల్ వంటి గేమ్స్లో ఈ రూల్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా సాధారణ ప్లేయర్గానే గేమ్లో పాల్గొంటాడు...’ అంటూ ప్రకటించింది బీసీసీఐ...
Image credit: PTI
అయితే ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్పై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘టీ20 క్రికెట్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికే టీ20లకు మంచి ఆదరణ ఉంది. అందరికీ అర్థమవుతోంది...
కొత్త మసాలను జోడిస్తే, కొన్నాళ్లకు మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు ఇంకేదో చేయాలనే ఆలోచనలోకి పడిపోతాం. ప్రతీ ఏడాది ఈ ఏడాది కొత్తగా ఏం చేస్తున్నారనే ఆలోచనే జనాల్లో పెరుగుతుంది. 50 ఓవర్ల క్రికెట్కి ఆదరణ రావడం లేదని టీ20లు తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిని బాగానే చూస్తున్నారు. మళ్లీ మార్పులు చేయడం ఎందుకు’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే..
అక్టోబర్ 11 నుంచి మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ, నవంబర్ 5న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో ఈ టోర్నీపై ఆసక్తి పెరిగింది...