- Home
- Sports
- Cricket
- ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం : ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తీరుపై పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం : ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తీరుపై పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్ కు వెళ్లకూడదని నిర్ణయించుకోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్.

భారత్ - పాక్ మధ్య నెలకొన్న ‘ఆసియా కప్’ ప్రతిష్టంబన కొనసా...గుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆ దేశానికి వెళ్లదని తెగేసి చెప్పిన నేపథ్యంలో ఆ దేశంలో మాజీ క్రికెటర్లు ఒక్కరొక్కరుగా బీసీసీఐపై విమర్శలకు దిగుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం పాక్ మాజీ వికెట్ కీపర్ మోయిన్ ఖాన్ కూడా చేరాడు.
స్థానికంగా ఓ టీవీ ఛానెల్ తో మోయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బాగుపడాలి. దీనికోసం రెండు క్రికెట్ బోర్డులు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు ఎందుకు రావడం లేదనే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చర్చించుకోవాలి.
ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ ఆడేందుకు పాక్ కు రానంటే.. పాకిస్తాన్ కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు వెళ్లబోమనే స్టాండ్ తీసుకుని దాని మీద కట్టుబడి ఉండాలి. వరల్డ్ కప్ ఆడేందుకు తాము కూడా భారత్ కు రాబోమని, తమకూ తటస్థ వేదికలు కావాలని పట్టుబట్టాలి.. ఇరు దేశాల బోర్డుల మధ్య ఉన్న మనస్పర్థల వల్ల క్రికెట్ ప్రభావితం కాకూడదు..’అని చెప్పాడు.
ఇక బీసీసీఐని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ మీరు ఆటను ఆర్థిక విషయాలతో చూస్తే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ప్రతి దేశం కూడా తమ దేశంలో ఉన్న వనరులతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఒక బోర్డు ఎక్కువగా డబ్బులున్న కారణంతో మరో దేశ బోర్డుపై ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు. ఇది క్రీడా స్ఫూర్తికే విరుద్ధం...’అని వ్యాఖ్యానించాడు.
కాగా ఆసియా కప్ వివాదంలో భారత్ మొదట్నుంచీ ఒకటే స్టాండ్ లో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా తాము పాకిస్తాన్ కు రాబోమని, ఒకవేళ తటస్థ వేదిక అయితే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇదివరకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూ వెల్లడించింది.
ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన సమావేశంలో కూడా బీసీసీఐ ఇదే విషయాన్ని పీసీబీ, ఏసీసీ సభ్య దేశాలకు స్పష్టం చేసింది. దీనిపై పీసీబీ అంగీకారం తెలిపినా తర్వాత ఇప్పుడు తన మాజీ క్రికెటర్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.