ముగిసిన ఐదో రోజు ఆట... ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన టీమిండియా...
డ్రా దిశగా సాగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్...
న్యూజిలాండ్కి 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం... ఆట ముగిసే సమయానికి సరికి సరిగ్గా 32 పరుగుల ఆధిక్యంలో భారత్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ డ్రా దిశగానే సాగేలా కనిపిస్తోంది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది టీమిండియా. న్యూజిలాండ్కి దక్కిన 32 పరుగుల ఆధిక్యం తీసివేయగా భారత జట్టుకి సరిగ్గా 32 పరుగుల ఆధిక్యమే దక్కింది...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకి ఆలౌట్ కావడంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకి 11వ ఓవర్లోనే తొలి షాక్ తగిలింది. 33 బంతుల్లో 8 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, టిమ్ సౌథీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత 81 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా సౌథీ బౌలింగ్లో ఎల్బీగానే పెవిలియన్ చేరాడు. ఛతేశ్వర్ పూజారా 55 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేయగా భారత సారథి విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రిజర్వు డేగా కేటియించిన ఆరో రోజున వాతావరణం సరిగ్గా సహకరిస్తే 98 ఓవర్ల పాటు ఆట సాగే అవకాశం ఉంటుంది. భారత జట్టు చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మొదటి సెషన్లో వీలైనంత వేగంగా పరుగులు చేసి, న్యూజిలాండ్కి 200+ టార్గెట్ను అందిస్తే ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంటుంది.
లేదా భారత జట్టు రేపు ఉదయం సెషన్లో త్వరగా వికెట్లు కోల్పోయినా, తొలి సెషన్లో పెద్దగా పరుగులు రాకపోతే వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు బ్యాట్స్మెన్. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
మొత్తానికి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఫలితం తేలడానికి రిజర్వు డే రోజు జరిగే మొదటి సెషన్ కీలకం కానుంది...