INDvsPAK: పాక్తో పోరుతోనే ప్రపంచకప్ సమరానికి సై.. నేడే ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్
India vs Pakistan: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు టోర్నీలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్ కు తెరలేవనుంది. పురుషుల క్రికెట్ మాదిరిగానే మహిళల విభాగంలో కూడా భారత్ - పాక్ మ్యాచ్ కు క్రేజ్ ఉంది.

దక్షిణాఫ్రికా వేదికగా రెండ్రోజుల క్రితమే ప్రారంభమైన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో నేడు కీలక పోరు జరుగనున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ ఆదివారం తలపడనున్నది. అండర్ - 19 మహిళల ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇచ్చిన స్ఫూర్తితో గత టోర్నీలో మిస్ అయినా (ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి) ఈసారి మాత్రం కప్ కొట్టడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగబోతుంది.
కేప్టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా నేడు భారత్ - పాక్ ల మధ్య తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ - బిలో ఉన్న ఇరు జట్లు నేటి మ్యాచ్ తోనే ప్రపంచకప్ సమరానికి సిద్ధమవుతాయి. సాధారణంగానే ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటుంది. ఇక ఐసీసీ టోర్నీలలో అయితే అది కొంచెం ఎక్కువే.
న్యూలాండ్స్ లో జరుగబోయే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ను జియో టీవీ, హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. పురుషుల క్రికెట్ లో మాదిరిగానే భారత్ - పాక్ మ్యాచ్ అంటే మహిళల క్రికెట్ లో కూడా కావాల్సినంత క్రేజ్ వచ్చింది. ఈ టోర్నీకి ముందు ఇరు జట్లూ రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడి ఓదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడాయి.
ఐసీసీ టీ20 టోర్నీలలో భారత్ - పాక్ లు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్ లలో విజయం భారత్ నే వరించింది. రెండు సార్లు పాక్ గెలిచింది. మొత్తంగా ఇరు జట్లూ ఇప్పటివరకు 13 సార్లు తలపడితే ఇందులో భారత్ ఏకంగా పది మ్యాచ్ లలో గెలిచి సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. పాకిస్తాన్ మూడు మ్యాచ్ లలో నెగ్గింది.
భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నేటి మ్యాచ్ లో ఆడేది లేనిది ఇంకా అనుమానంగానే ఉంది. వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్ లో మంధాన ఆడేది అనుమానమే. అయితే ఆమె లేకున్నా భారత జట్టు బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇటీవలే మహిళల అండర్ - 19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు సారథి షెఫాలీ వర్మ కు తోడుగా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హర్మన్ ప్రీత్ కౌర్, హర్లిన్ డియోల్ లు మంచి ఫామ్ లో ఉన్నారు.
పుజా వస్త్రకార్, దీప్తి శర్మలు ఆల్ రౌండర్లుగా నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. టీమిండియా యువ సంచలనం రేణుకా సింగ్ ఠాకూర్.. సఫారీ పిచ్ లపై చెలరేగితే పాక్ కు తిప్పలు తప్పవు. రేణుకా తో పాటు రాధా యాదవ్ , శిఖాలు పేస్ భారాన్ని మోయనున్నారు.
అయితే పాకిస్తాన్ ను మరీ తేలికగా తీసుకుంటే ప్రమాదమే. నిరుడు ఆసియా కప్ లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించిన విషయం హర్మన్ప్రీత్ సేనకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ టీమ్ లో కెప్టెన్ బిస్మా మరూఫ్ తో పాటు స్పిన్నర్ నష్రా సంధు లతో పాటు సిద్రా అమీన్, ఒమైమ సోహైల్ రూపంలో మంచి బ్యాటర్లు కూడా ఉన్నారు.
ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ మిగిలిన మ్యాచ్ లలో ఒక్క ఇంగ్లాండ్ తప్ప కఠిన ప్రత్యర్థులే లేరు. ఐర్లాండ్, వెస్టిండీస్ లపై కొద్దిగా కష్టపడ్డా చాలు. భారత్ ఈజీగా నాకౌట్ దశకు చేరుకోవచ్చు. మరి నేటి మ్యాచ్ లో హర్మన్ప్రీత్ సేన ఏం చేసేనో...!