సూపర్-12లో అత్యుత్తమ 8 మ్యాచ్లు ఇవే.. రెండు భారత్వే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సూపర్-12 దశ ముగిసింది. ఆదివారం ఇండియా-జింబాబ్వే మ్యాచ్ తో ఈ దశకు ఎండ్ కార్డ్ పడింది. నవంబర్ 9 నుంచి సెమీస్ పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆసక్తికర పోస్ట్ చేసింది.

గత నెల 16న మొదలైన టీ20 ప్రపంచకప్ లో నవంబర్ 6 వరకు సూపర్- 12 దశ ముగిసింది. క్వాలిఫై రౌండ్ ఆడి టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు రెండు గ్రూప్ లలో చేరి హోరాహోరిగా పోరాడాయి. చివరి బంతి వరకు ఫలితం తేలని మ్యాచ్ లు, ఏకపక్షంగా సాగినవి కొన్ని, ఆధిక్యం చేతులు మారుతూ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్ లు కొన్ని.. ఇలా సూపర్-12 లో ది బెస్ట్ అనిపించే 8 మ్యాచ్ లను ఐసీసీ పేర్కొంది. ఇందులో భారత్ మ్యాచ్ లు రెండు ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మ్యాచ్.. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్, సఫారీలను 13 పరుగుల తేడాతో ఓడించారు. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. 8 వికెట్లు కోల్పోయి 145 పరుగుల వద్దే ఆగిపోయింది.
రెండో స్థానంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు స్థానం దక్కింది. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్.. చివరి బంతికి విజయాన్ని అందుకుంది.
ఐర్లాండ్ - ఇంగ్లాండ్ మ్యాచ్ కు మూడో ప్లేస్ దక్కింది. వర్షం కారణంగా రద్దైన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధితిలో ఐర్లాండ్ ఈ మ్యాచ్ ను ఐదు పరుగుల తేడాతో నెగ్గింది.
జింబాబ్వే-పాకిస్తాన్ మ్యాచ్ నాలుగో స్థానంలో ఉంది. భారత్-పాక్ మ్యాచ్ మాదిరే చివరి బంతి వరకూ ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా అందులో విఫలమై రనౌట్ అయింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది.
బంగ్లాదేశ్ - జింబాబ్వే.. ఈ మ్యాచ్ కూడా చివరి బంతి వరకూ ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా జింబాబ్వే.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగుల వద్దే ఆగింది. దీంతో బంగ్లా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా-అఫ్గానిస్తాన్.. సెమీస్ రేసులో నిలవాలంటే ఆసీస్ ఈ మ్యాచ్ ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. కానీ ఈ మ్యాచ్ లో కూడా ఆసీస్ తొలుత బ్యాటింగ్ లో 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ తప్ప అందరూ విఫలమయ్యారు. తర్వాత అఫ్గాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ విధ్వంసంతో అఫ్గాన్ గెలిచినంత పని చేసింది.
సౌతాఫ్రికా - ఇండియా మధ్య గ్రూప్-2లో ముగిసిన మ్యాచ్ కూడా లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగింది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్.. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో తడబడింది. తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా.. 19.4 ఓవర్లు తీసుకుంది. మిల్లర్ మెరుపులతో సఫారీలు విజయాన్ని అందుకున్నారు.
న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య సూపర్-12 ప్రారంభ మ్యాచ్ ను కూడా ఐసీసీ బెస్ట్ థ్రిల్లర్ గా గుర్తించింది. టోర్నీ ఫేవరేట్లుగా ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్.. 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 89 పరుగుల తేడాతో గెలిచింది.