IND vs PAK : పాకిస్తాన్ కు షాకిచ్చిన ఐసీసీ.. హారిస్ రౌఫ్, ఫర్హాన్లకు వార్నింగ్
Asia Cup 2025: ఆసియా కప్లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో రెచ్చగొట్టేలా వివాదస్పద ప్రవర్తనతో నడుచుకున్న పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. హారిస్ రౌఫ్కు ఐసీసీ 30% మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది.

పాక్ కు షాక్.. హారిస్ రౌఫ్కు జరిమానా
ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్లో వివాదాస్పద ప్రవర్తన చేసిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 21న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో హారిస్ రౌఫ్ ప్రేక్షకుల వైపు చూస్తూ అభ్యంతరకర హావభావాలు, అలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. అతని తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. క్రికెట్ లవర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఐసీసీ దీనిపై విచారణ జరిపి హారిస్ రౌఫ్ కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.
KNOW
సాహిబ్జాదా ఫర్హాన్కు ఐసీసీ వార్నింగ్
అదే మ్యాచ్లో మరో పాక్ ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత తుపాకీ కాల్పులు చేసినట్లు బ్యాట్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్ పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అతనికి జరిమానా విధించలేదు. కానీ, మరోసారి ఇది రిపీట్ కావద్దని హెచ్చరిక చేసింది. ఈ సెలబ్రేషన్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఫర్హాన్ మాట్లాడుతూ.. ఇది ఆ క్షణంలో వచ్చిన భావోద్వేగం అని, తన పఖ్తూన్ తెగ సంప్రదాయానికి సంబంధించిన సెలబ్రేషన్ ను మాత్రమే చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఆధ్వర్యంలో ఐసీసీ విచారణ
పాక్ ప్లేయర్ల తీరుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ పాకిస్థాన్ జట్టు హోటల్లో జరిగింది. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. రౌఫ్, ఫర్హాన్ ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారి రాతపూర్వక సమాధానాలను కూడా సమర్పించారు. జట్టు మేనేజర్ నవీద్ అక్ఱమ్ చీమా కూడా విచారణలో పాల్గొన్నారు.
బీసీసీఐ ఫిర్యాదు
భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఈ సంఘటనలపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. హారిస్ రౌఫ్ విమానం కూల్చినట్లుగా చూపిన ప్రవర్తన, అలాగే ఫర్హాన్ తుపాకీ సంబరం చేయడం వంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయగా, దీనిని ఐసీసీ లెవెల్ 1 నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది.
భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు
ఈ టోర్నమెంట్లో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గ్రూప్ దశలో భారత ఆటగాళ్లు పాకిస్థాన్తో చేతులు కలపకుండా నిరాకరించారు. అదే వివాదం సూపర్ 4 మ్యాచ్లోనూ కొనసాగింది. మ్యాచ్ సమయంలో రౌఫ్, భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలతో కూడా మాటల యుద్ధానికి దిగాడు. ప్రేక్షకులు "కోహ్లీ కోహ్లీ" అంటూ నినాదాలు చేయగా, రౌఫ్ మరింత ఆగ్రహంతో ప్రవర్తించాడు.
ఇక మరోవైపు, పీసీబీ కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఫిర్యాదు చేసింది. భారత్ విజయం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయని పేర్కొంది. అయితే ఐసీసీ విచారణలో సూర్యకుమార్ కేవలం హెచ్చరికతో తప్పించుకున్నాడు. తాజా పరిణామాలతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ రైవల్రీ మరింత వేడెక్కింది.