రవీంద్ర జడేజాకు షాకిచ్చిన ఐసీసీ.. అలా చేసినందుకు భారీ జరిమానా
ICC: టీమిండియా సూపర్ స్టార్ రవీంద్ర జడేజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. జడ్డూ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో భారీ కోత పెట్టింది.

నాగ్పూర్ టెస్టులో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తొలి టెస్టులో జడ్డూ.. తన చేతికి లోషన్ రాసుకోవడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అంతేగాక అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.
ఆసీస్ తో తొలి టెస్టులో భాగంగా కంగారూలు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా జడ్డూ 46వ ఓవర్ వేశాడు. అయితే ఈ ఓవర్ మధ్యలో జడ్డూ తన ఎడమ చేతి చూపుడు వేలికి లోషన్ రాసుకున్నాడు. సిరాజ్ చేతి నుంచి లోషన్ తీసుకుని దానిని తన వేలికి రాశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
దీంతో జడ్డూ మ్యాచ్ లో చీటింగ్ చేశాడని, అతడు బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా, ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. తొలి ఇన్నింగ్స్ లో తన చేతికి ఏదో రాసుకోవడం వల్లే అతడికి ఐదు వికెట్లు దక్కాయన్నంత రేంజ్ లో అక్కడి మీడియా బిల్డప్ ఇచ్చింది. దీనికి ఆసీస్ మాజీ సారథి టిమ్ పైన్ తో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా మద్దతుపలికాడు.
అయితే జడేజా వేలికి పూసుకున్నది నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్ అని, అతడు బాల్ ట్యాంపరింగ్ చేయాలని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. వేలికి గాయమైతే లోషన్ రాసుకోవడం ఐసీసీ నిబంధనల్లో ఉందని అదేం తప్పు కాదని స్పష్టమైన ప్రకటన కూడా చేసింది.
బీసీసీఐ క్లారిటీ ఇచ్చినా ఐసీసీ మాత్రం జరిమానా విధించడం గమనార్హం. వేలికి ఆయింట్మెంట్ రాసుకోవడం తప్పు కాకున్నా అలా చేసేప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ ను సంప్రదించి ఆ పని చేయాలని.. కానీ జడేజా అలాంటిదేమీ చేయకుండా నేరుగా లోషన్ రాసుకున్నాడని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. అంతేగాక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డిసిప్లినరీ పాయింట్లలో ఒక పాయింట్ కోత విధించింది.
ఇదిలాఉండగా నాగ్పూర్ టెస్టులో జడ్డూ అటు బాల్ తోనూ ఇటు బ్యాట్ తోనూ రాణించి భారత విజయంలో కీలక భూమిక పోషించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే చాపచుట్టేసింది. ఈ ఇన్నింగ్స్ లో జడ్డూ ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో (70) కూడా ఇరగదీశాడు. రోహిత్, అక్షర్ లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ ప్రదర్శనతో జడ్డూ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.