టెస్టు క్రికెట్ చరిత్రలో అదే తోపు... ‘ది అల్టీమేట్ టెస్టు సిరీస్’గా భారత్, ఆస్ట్రేలియా సిరీస్...
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నో చారిత్రక విజయాలు, ఎన్నో అత్యద్భుతమైన టెస్టు మ్యాచులు ఉన్నాయి. అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్కి మాత్రం భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే గబ్బాలో ఆసీస్కి ‘అబ్బా...’ అనిపించే దెబ్బ తీసిన భారత జట్టు ప్రదర్శనను ఐసీసీ ‘ది అల్టీమేట్ టెస్టు సిరీస్’గా పేర్కొంది.
ఐసీసీ గవర్నింగ్ బాడీ, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమైనవిగా పేర్కొనే 16 టెస్టు సిరీస్లను ఎంచుకుని, వాటిలో ది బెస్ట్ సిరీస్ను నిర్ణయించాల్సిందిగా అభిమానులను కోరింది. ఇందులో 1999 వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్, 2008-09 ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, 2005 యాషెస్ సిరీస్ వంటి థ్రిల్లింగ్ సిరీస్లు ఉన్నాయి.
అయితే వీటన్నింటిల్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా 2020-21 బోర్డర్- గవాస్కర్ ట్రోపీకే మెజారిటీ ఓట్లు దక్కాయి. ఫైనల్లో ఆసీస్ వర్సెస్ భారత్ సిరీస్తో పోటీపడిన 1999 ఇండియా, పాకిస్తాన్ సిరీస్కి 20 శాతం ఓట్లు కూడా రాలేదు... దీనికి కారణం ఆడిలైడ్ టెస్టు రిజల్ట్ తర్వాత భారత జట్టు చూపించిన అసామాన్యమైన ప్రదర్శనే.
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం అంటే అంత తేలికైన పనికాదు. అదీకాకుండా ఆడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది టీమిండియా. ఆ తర్వాత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇక భారత జట్టు పని అయిపోయిందని అనుకున్నారంతా. ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనాలు కూడా వేశారు...
అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ భారత జట్టు, మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టు నుంచే ఊహించని కమ్బ్యాక్ ఇచ్చింది. తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న అజింకా రహానే, బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో చెలరేగాడు.
ఇక అక్కడి నుంచి భారత జట్టు జోరు ఎక్కడా ఆగలేదు. ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ వంటి ఆసీస్ టాప్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సాగింది భారత బ్యాటింగ్...
మూడో టెస్టు జరిగిన సిడ్నీలో ఆసీస్ విజయం ఖాయమని అనుకున్నారంతా. ఆఖరి రోజు టీమిండియా ముందు కొండంత లక్ష్యం. 97 పరుగులు చేసిన రిషబ్ పంత్, హాఫ్ సెంచరీ చేసిన పూజారా కూడా అవుట్. ఇక ఓడిపోవడం లాంఛనమే అనుకున్నారంతా.
కానీ అక్కడ కూడా, అలాంటి సమయంలో కూడా భారత జట్టు అద్భుతమైన పోరాటం చేసింది. గాయంతో బాధపడుతూనే హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ 50 ఓవర్లకు పైగా క్రీజులో అతుక్కుపోయారు. వారి సహనానికి, పోరాటానికి ఆసీస్ బౌలర్లు తలొగ్గారు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అయితే మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్, మూడో టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నవ్దీప్ సైనీ గాయపడ్డారు. వీళ్లేవరూ లేకుండా నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వంటి కుర్రాళ్లతో గబ్బాలో ఆఖరి టెస్టు. 32 ఏళ్లుగా ఆసీస్కి ఓటమి రుచి తెలియని బ్రిస్బేన్లో మ్యాచ్...
అయితే యువభారతం, క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా పర్ఫామెన్స్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కి భారీ ఆధిక్యం దక్కుతుందని అనుకుంటున్న సమయంలో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలు... శతాధిక భాగస్వామ్యం...
రెండో ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ 5 వికెట్ల పర్ఫామెన్స్... ఆఖరి రోజు ఆసీస్ బౌలర్లకు అడ్డుగా నిలబడి ఛతేశ్వర్ పూజారా డేరింగ్ బ్యాటింగ్... శుబ్మన్ గిల్ మెరుపులు... ఆ తర్వాత రిషబ్ పంత్ షో... అన్నీ కలిపి ‘గబ్బా’లో ఆస్ట్రేలియాకి మైండ్ బ్లాక్ అయ్యే ఓటమి...
2018లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్లు లేని జట్టుపై గెలిచారనే విమర్శను తొక్కిపెడుతూ... ఆ ఇద్దరూ జట్టులో ఉండగా అఖండ విజయాలు అందుకుంది భారత జట్టు.
విరాట్ కోహ్లీ లేకుండా, గాయాలతో సీనియర్లు జట్టుకు దూరమైనప్పుడు కుర్రాళ్లు చూపించిన తెగువకు క్రికెట్ ప్రపంచం సలాం చేసింది. అందుకే 2020-21 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, ఐసీసీ టెస్టు సిరీస్ల చరిత్రలోనే ‘ది అల్టీమేట్ టెస్టు సిరీస్’గా గుర్తింపు దక్కించుకుంది.