- Home
- Sports
- Cricket
- IND vs PAK: అప్పుడే దెబ్బపడింది.. ఇప్పుడేమీ చెప్పలేను.. ఇండియా-పాక్ మ్యాచ్ పై భజ్జీ కామెంట్స్
IND vs PAK: అప్పుడే దెబ్బపడింది.. ఇప్పుడేమీ చెప్పలేను.. ఇండియా-పాక్ మ్యాచ్ పై భజ్జీ కామెంట్స్
Harbhajan Singh: గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాక్ చేతిలో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఎవరు గెలుస్తారో చెప్పడం..

ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు.. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది.
కాగా ఆ హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఇప్పట్నుంచే జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను గతేడాది అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు దెబ్బేశాయని.. ఇప్పుడు అలా అంచనా వేయబోనని చెప్పాడు.
పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షోయభ్ అక్తర్ తో జరిగిన ఓ సంభాషణలో భజ్జీ మాట్లాడుతూ.. ‘మనకు మరో టీ20 ప్రపంచకప్ సమరం రాబోతుంది. అయితే ఈసారి నేను భారత్-పాక్ మ్యాచ్ గురించి ఎటువంటి స్టేట్మంట్స్ ఇవ్వను. ఎవరు గెలుస్తారనేదానిపై కూడా ఏం అంచనా వేయను.
మోకా-మోకా తో పాటు దేని గురించి కూడా స్పందించను. గతేడాది నేను భారత్ గెలుస్తుందని చెప్పాను. కానీ అప్పుడు ఫలితం మాకు అనుకూలించలేదు...’ అని చెప్పుకొచ్చాడు.
గతేడాది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు హర్భజన్ అక్తర్ తో.. ‘మీరు ఈ మ్యాచ్ ఆడటంలో అర్థమే లేదు. మేం ముందుకు వెళ్లడానికి గాను మాకు దారినివ్వండి. మీరు ఈ మ్యాచ్ ఆడినా గెలవరు. ఓడిపోతారు. నిరాశకు గురౌతారు. మా జట్టును చూశావా.. ఎంత సాలిడ్ గా ఉందో..? మిమ్మల్ని వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిస్తారు..’అని కామెంట్స్ చేశాడు.
అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పాక్ అభిమానులు హర్భజన్ ను ఆడుకున్నారు. అతి నమ్మకం పనికి రాదని సూచించారు. ట్విటర్ వేదికగా భజ్జీపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. దీంతో అతడు ఈసారి అలాంటి ప్రకటనల జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తున్నాడు.