అతని మీద కోపంతోనే బ్యాటును కత్తిలా తిప్పా... తన సెలబ్రేషన్స్కి అర్థం చెప్పిన రవీంద్ర జడేజా...
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటును కత్తిలా తిప్పుతూ చేసుకునే స్వార్డ్ సెలబ్రేషన్స్కి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా జడ్డూ సెలబ్రేషన్ స్టైల్ను ఇమిటేట్ చేశాడు. తన సెలబ్రేషన్స్కి అర్థం ఏంటో తెలియచేశాడు జడ్డూ...
భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్... రవీంద్ర జడేజాని ‘బిట్స్ అండ్ పీస్ ప్లేయర్’ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కామెంట్పై రవీంద్ర జడేజా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు కూడా...
‘సంజయ్ మంజ్రేకర్ నోటి డయేరియా వ్యాధితో బాధపడుతున్నాడంటూ’ కామెంట్ చేసిన రవీంద్ర జడేజా... 2019 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ విఫలమైన సమయంలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
59 బంతుల్లో 77 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, హాఫ్ సెంచరీ అనంతరం తొలిసారిగా బ్యాటును కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు... దానికి కారణం ఇప్పుడు వివరించాడు జడ్డూ.
‘అప్పుడు నేను చాలా వేడి మీద ఉన్నా. కామెంటరీ బాక్సులో అతని కోసం వెతుకుతూ ఉన్నా. ఆ తర్వాత అర్థమైంది, అతను ఇక్కడ మరెక్కడో దాక్కుని ఉండొచ్చని... నేను ఎవరికి టార్గెట్ చేస్తున్నానో, ఆ సెలబ్రేషన్స్ ఎవరిని ఉద్దేశంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా’ అంటూ వివరించాడు రవీంద్ర జడేజా.
2009లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా, నిలకడైన ప్రదర్శన ఇస్తోంది గత రెండు, మూడేళ్లుగానే. ఫామ్ కోల్పోయి కొన్నేళ్లపాటు జట్టుకి కూడా దూరమయ్యాడు రవీంద్ర జడేజా...
‘2018కి ముందు దాదాపు ఏడాదిన్నరపాటు నేను నిద్రలేని రాత్రులు గడిపా. పడుకుందామని ఎంత ప్రయత్నించినా నిద్రపట్టేది కాదు. తెల్లవార్లు మేల్కొని ఉండేవాడిని. టెస్టు జట్టులో కొనసాగుతున్నా, తుది జట్టులో మాత్రం అవకాశం దక్కేది కాదు.
వన్డేల్లో చోటు కోల్పోయా. భారత జట్టుతో కలిసి ప్రయాణం చేయడం వల్ల దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం కూడా వచ్చేది కాదు. అయితే 2018లో ఇంగ్లాండ్తో జరిగిన ఓవల్ టెస్టు నా కెరీర్ మొత్తాన్ని మార్చేసింది.
ఆ టెస్టు నా క్రికెట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్. నా పర్ఫామెన్స్, నా కాన్ఫిడెన్స్, ప్రతిదీ మార్చేసింది. ఇంగ్లాండ్ పిచ్ల మీద, బెస్ట్ బౌలింగ్ అటాక్లో హాఫ్ సెంచరీ చేయడం నాలో చాలా నమ్మకాన్ని పెంచింది.
ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించగలననే నమ్మకం కలిగింది. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా గాయపడడంతో వన్డేల్లో కమ్బ్యాక్ ఇచ్చా. ఆ తర్వాత నా గేమ్ బాగా సాగుతోంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా.
ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్, సిక్సర్తో 37 పరుగులు రాబట్టిన జడ్డూ, మరోసారి బ్యాటును కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకడు. అయితే గాయాల కారణంగా అతను వరుసగా భారత జట్టుకు దూరమవుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా జడ్డూ టాప్ క్లాస్ ప్లేయర్.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో గాయపడిన జడేజా, టెస్టు సిరీస్లో ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ సిడ్నీ టెస్టులో గాయపడి ఇంగ్లాండ్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొట్టిన జడ్డూ, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నాడు.
51 టెస్టులు ఆడిన రవీంద్ర జడేజా, 1954 పరుగులతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు. 2018లో తన తొలి టెస్టు సెంచరీ చేసిన జడ్డూ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కీలకం మారనున్నాడు. 2018 ఇంగ్లాండ్ పర్యటనలో జడ్డూ 156 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 86 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.