నేనెలా ఆడుతున్నానో గానీ అందుకే వికెట్ కీపర్ అయ్యా : రిషభ్ పంత్
Rishabh Pant: టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్ లో అతడు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

టీమిండియాకు ధోని రిటైరైన తర్వాత మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ గా మారిన రిషభ్ పంత్.. తాను వికెట్ కీపర్ గా అవడానికి గల కారణాలను వివరించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో జరుగుబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆడనున్న అతడు.. తన వికెట్ కీపింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Rishabh Pant
తాజాగా పంత్ ఎస్జీ పోడ్కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేనెలా వికెట్ కీపింగ్ చేస్తున్నానో నాకు తెలియదు. రోజురోజుకూ అది మెరుగవుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ప్రతి రోజూ నేనూ నా నుంచి 100 శాతం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను.
నేనెప్పుడూ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉండటానికే ఇష్టపడతాను. చిన్నప్పట్నుంచి నేను అదే కావాలనుకున్నాను. ఎందుకంటే మా నాన్న కూడా వికెట్ కీపరే. ఆయనే నాకు స్పూర్తి. ఆయనను చూసే నేను వికెట్ కీపర్ అవ్వాలని నిశ్చయించుకున్నాను..’ అని తెలిపాడు.
ఇక ఏడాది పాటు తీరిక లేని క్రికెట్ ఆడుతుండటం వల్ల మానసికంగా ఒత్తిడి ఉండటం సహజమే అని దానిని ఎదుర్కోవడానికి మనసును నిత్యం ప్రశాంతంగా ఉంచుకుంటానని చెప్పుకొచ్చాడు.
‘వికెట్ కీపర్ బ్యాటర్ అంటే మొదటి బంతినుంచి ఇన్నింగ్స్ చివరి బంతి వరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బంతిని అందుకునే ప్రయత్నం చేయాలి. అయితే మీరు మంచి వికెట్ కీపర్ కావాలంటే మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవాలి..
అదీగాక ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరు మీ మనసును రిఫ్రెస్ చేసుకోవాలి. మనం నిరంతరం ఆడుతుండటం వల్ల ఒత్తిడి సహజం. ఆ సమయంలో మీరు రిఫ్రెస్ అవకుంటే మీరు గ్రౌండ్ లో వంద శాతం ఇవ్వలేరు. క్రికెటర్లు గా మనం మన మనసులపై నిత్యం పని చేస్తూనే ఉండాలి..’ అని అన్నాడు.