పృథ్వీషాకి అప్పుడే చెప్పా... అయినా పట్టించుకోలేదు... మహ్మద్ కైఫ్ కామెంట్...
మొదటి టెస్టులో భారత జట్టు వైఫల్యం తర్వాత ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్ పృథ్వీషా... తొలి ఇన్నింగ్స్లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రాక్టీసు మ్యాచుల్లో కూడా ఫెయిల్ కావడంతో మనోడికి ఓ రేంజ్లో ఆటాడుకున్నారు నెటిజన్లు. రెండో టెస్టులో పృథ్వీషాకి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.
రెండేళ్ల క్రితం భారత జట్టులో ఓ సంచలనంలా దూసుకొచ్చాడు పృథ్వీషా... ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు...
వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేసే ఈ కుర్రాడు, తన టెక్నిక్తో ఫ్యూచర్ సచిన్గా గుర్తింపు దక్కించుకున్నాడు...
అయితే ఫిట్నెస్పైన ఏ మాత్రం ఫోకస్ పెట్టని పృథ్వీషా... రెండేళ్లలోనే విమర్శకులకు టార్గెట్ అయ్యాడు...
భారత జట్టు ఓటమికి పృథ్వీషా ఫెయిల్యూర్ ప్రధాన కారణమని ఆరోపించాడు వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్... ఇలాంటి వాళ్లు ఎందరో...
అయితే ఐపీఎల్ 2020 సమయంలోనే పృథ్వీషాని హెచ్చరించాడట భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్...
‘ఐపీఎల్ 2020 సీజన్లో కూడా పృథ్వీషా పెద్దగా సక్సెస్ కాలేదు. అతని టెక్నిక్ను అర్థం చేసుకున్న బౌలర్లు, ఈజీగా అవుట్ చేశారు...
అందుకే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి ముందు పృథ్వీషాకి పరిస్థితిని అర్థం చేసుకోవాలని వివరించా... టెక్నిక్ మార్చుకోకపోతే భవిష్యత్తులో రాణించడం కష్టమవుతుందని హెచ్చరించా...
బౌలర్లు ఫెయిల్ అయినప్పుడు పృథ్వీషా టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. కానీ సీమ్తో దూసుకొచ్చే బంతులును ఎదుర్కోవడంలో మాత్రం పృథ్వీషా టెక్నిక్ ఏ మాత్రం సాయపడదు...
అందుకే అతనికి ఆ విషయంపైన ఫోకస్ పెట్టమని చెప్పాను. కానీ పృథ్వీషా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అందుకే తొలి టెస్టులోనూ అదే రీతిలో అవుట్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ కైఫ్
‘ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడడం అంటే చాలా కఠినమైన పరీక్షలాంటిది. అదీకాకుండా పృథ్వీషాకి ఆడిలైడ్ టెస్టు మొట్టమొదటి పింక్ బాల్ టెస్టు... అందుకే స్టార్క్, కమ్మిన్స్ అతన్ని బాగా ఇబ్బంది పెట్టారు...
పృథ్వీషా టెక్నిక్ను ఈజీగా అర్థం చేసుకుని మొదటి ఓవర్లోనే వికెట్ తీయగలిగారు... నేను ప్లేయర్లను ఇబ్బంది పెట్టే కోచ్ను కాదు... వారి ఆలోచనలు, ప్రణాళికలకు తగ్గట్టుగా పనిచేసేవాడిని...
నెట్స్లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇబ్బంది పడే ప్లేయర్తో ఏం చెప్పగలం.. అందుకే పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడా... సచిన్, రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెటర్లు నెట్స్లో సాధ్యమైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసేవాళ్లు. వారి సక్సెస్కి అదే కారణం...
క్యాచ్ ప్రాక్టీస్తో పాటు రన్నింగ్, జిమ్ ట్రైనింగ్పై కూడా ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పాను... కానీ పృథ్వీషా అలా చేయలేదు...’ అని చెప్పాడు కైఫ్..
మహ్మద్ కైఫ్ కామెంట్లతో పృథ్వీషాపై ట్రోలింగ్ మరింత పెరిగింది. 21 ఏళ్ల కుర్రాడు ఫెయిల్ అయితే, ఇంతగా ట్రోల్ చేయాలా? అని జాలి చూపించినవాళ్లు కూడా ఇప్పుడు అతని బద్ధకంపై విమర్శలు చేస్తున్నారు.