అది కోహ్లీ నుంచే నేర్చుకున్నా : హిట్మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగ్పూర్ టెస్టులో అటు బ్యాటర్ గానే గాక ఇటు సారథిగా కూడా రోహిత్ శర్మ తన స్కిల్స్ ను చూపించాడు. ఆసీస్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో కాసేపు విసిగించినా ఓపికగా ఉంటూ వారిలో ఒత్తిడి పెంచేలా బౌలింగ్ లో మార్పులు చేశాడు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ముగిసిన టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై ఇరు జట్ల స్పిన్నర్లు పండుగ చేసుకున్నారు. అయితే బ్యాటింగ్ లో ఆసీస్ బ్యాటర్లతో పాటు భారత మిడిలార్డర్ విఫలమైనా టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు రాణించారు.
ఈ మ్యాచ్ లో ఆసీస్ రెండు సార్లు ఆలౌట్ అవగా ఇందులో నాలుగు వికెట్లు (మొత్తం 20) మాత్రమే పేసర్లకు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా కు ఐదు, అశ్విన్ కు మూడు వికెట్లు దక్కగా.. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు, జడ్డూకు రెండు, అక్షర్ కు ఒక వికెట్ దక్కింది.
అయితే నాగ్పూర్ టెస్టులో అటు బ్యాటర్ గానే గాక ఇటు సారథిగా కూడా రోహిత్ శర్మ తన స్కిల్స్ ను చూపించాడు. ఆసీస్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో కాసేపు విసిగించినా ఓపికగా ఉంటూ వారిలో ఒత్తిడి పెంచేలా బౌలింగ్ లో మార్పులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ ను స్మిత్, లబూషేన్ లు సమర్థంగా ఎదుర్కుంటున్నప్పుడు అతడిని కాదని జడ్డూతో ఎక్కువ ఓవర్లు వేయించడం.. బ్యాటర్లను కుదురుకోనీయకుండా చేయడంలో హిట్మ్యాన్ సక్సెస్ అయ్యాడు.
ఈ స్కిల్స్ ను తాను టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకున్నానని రోహిత్ మ్యాచ్ అనంతరం చెప్పడం గమనార్హం. రోహిత్ మాట్లాడుతూ... ‘నేను విరాట్ కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు అతడి దగ్గర చాలా విషయాలు గమనించేవాడిని. టెస్టులలో మనకు వికెట్ దక్కకున్నా ఓపికగా ఉండటం ముఖ్యం. అలా అని చేతులెత్తేయకూడదు. ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచుతూనే ఉండాలి.
ప్రత్యర్థి టీమ్ మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని పసిగట్టి దానికి అనుగుణంగా బౌలింగ్ లో మార్పులు చేయాలి. ఇది నేను విరాట్ ను చూసి నేర్చుకున్నా. నాగ్పూర్ లో కూడా అదే చేశా. ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలను అమలు చేశా..’ అని అన్నాడు.
ఇక భారత స్పిన్ త్రయం అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ లను రోహిత్ ఆసీస్ పేసర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్ లతో పోల్చాడు. అక్షర్, జడ్డూ, ఆష్ (అశ్విన్) లు తమను ఎప్పుడూ నిరాశపరచరని.. ఈ ముగ్గురూ మరింతకాలం భారత్ కు సేవలందిస్తారని రోహిత్ చెప్పాడు. ప్రత్యేకించి అశ్విన్ కు వయసు పెరుగుతున్నా అతడి బౌలింగ్ లో వాడి తగ్గలేదని చెప్పాడు.