నాకు అతన్ని చూస్తే అసూయగా ఉంది, నేను కూడా టీమిండియాపైనే ఆడా... రాస్ టేలర్ కామెంట్...
న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్, 17 ఏళ్లుగా క్రికెట్లో కొనసాగుతున్నాడు. వన్డే, టీ20, టెస్టుల్లో 100 మ్యాచులకు పైగా ఆడిన మొదటి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన రాస్ టేలర్, కివీస్ తరుపున అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్ కూడా...
టీమిండియాపై మంచి రికార్డు ఉన్న రాస్ టేలర్, తన కెరీర్లో 107 టెస్టుల్లో 7506 పరుగులు చేశాడు. ఇందులో 19 టెస్టులు, 35 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 37 ఏళ్ల రాస్ టేలర్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
‘నేను కూడా టీమిండియాపైనే నా 100వ టెస్టు ఆడాను. కానీ నాకు వాళ్లు టీ షర్ట్ ఇవ్వలేదు. అందుకే తన 100వ టెస్టులో టీమిండియా జెర్సీ తీసుకున్న నాథన్ లియాన్ను చూస్తే అసూయగా ఉంది...
నేను ఆ మ్యాచ్ చూశాను. నాథన్ లియాన్కి టీ షర్ట్ ఇచ్చినప్పుడు కాస్త ఫీల్ అయ్యా... మేం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడాం.
అయినా ఇండియాతో ఫైనల్ మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవడం లేదు... అజింకా రహానే క్రికెట్ గేమ్కి గొప్ప అంబాసిడర్లాంటోడు. అతనితో కలిసి రాజస్థాన్ రాయల్స్తో ఆడాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రాస్ టేలర్...
న్యూజిలాండ్ టూర్లో టీమిండియా రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడింది. ఆ సిరీస్లో 100వ టెస్టు పూర్తిచేసుకున్న రాస్ టేలర్కి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, 100 వైన్ బాటిళ్లను గుర్తుగా బహుకరించింది...
అజింకా రహానే కెప్టెన్సీలో గబ్బా టెస్టులో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత జట్టు, మ్యాచ్ అనంతరం జరిగిన ట్రోఫీ బహుకరణ సమయంలో నాథన్ లియాన్కి టీమిండియా ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని 100వ టెస్టు మ్యాచ్కి గుర్తుగా ఇచ్చింది...
ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చెన్నైలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి 100వ టెస్టు. ఆ సమయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ కూడా ఇదే విధంగా ప్రశ్నించాడు. నాథన్ లియాన్కి ఇచ్చినట్టుగా జో రూట్కి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు...
2019 వన్డే వరల్డ్కప్ సమయంలోనే క్రికెట్కి రిటైర్మెంట్ తీసుకోవాలని భావించిన రాస్ టేలర్, ఫైనల్లో న్యూజిలాండ్ ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. క్రికెట్ని ఎంజాయ్ చేస్తున్నంతకాలం ఆటలో కొనసాగుతానని చెప్పాడు రాస్ టేలర్.