- Home
- Sports
- Cricket
- ఆ రూల్ ను ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కావడం లేదు.. ఐపీఎల్ కొత్త నిబంధనలపై కివీస్ ఆల్ రౌండర్ విమర్శలు
ఆ రూల్ ను ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కావడం లేదు.. ఐపీఎల్ కొత్త నిబంధనలపై కివీస్ ఆల్ రౌండర్ విమర్శలు
IPL New Rules: త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్-15 సీజన్ నుంచి పలు కొత్త నిబంధనలను బీసీసీఐ ప్రవేశపెట్టనున్నది. అయితే ఈ కొత్త రూల్స్ పై న్యూజిలాండ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జిమ్మీ నీషమ్ విమర్శలు గుప్పించాడు.

ఈ ఏడాది ఐపీఎల్ లో బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కొవిడ్ నిబంధనలు, డీఆర్ఎస్ తో పాటు ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకొచ్చిన ‘బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ తప్పనిసరిగా స్ట్రైకింగ్ తీసుకోవడం..’ నిబంధనను అమలు చేయనుంది.
అయితే ఈ కొత్త నిబంధనపై న్యూజిలాండ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్న జిమ్మీ నీషమ్ విమర్శలు గుప్పించాడు. ఈ నిబంధన వల్ల ఉపయోగమేంటో తనకైతే అర్థం కావడం లేదని ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
నీషమ్ స్పందిస్తూ.. ‘నాకు నిజంగా ఈ నిబంధన ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ నిబంధన వల్ల ఇన్నాళ్లు ఎవరికైనా ఇబ్బంది తలెత్తిందా..? ఇది నాకు నచ్చడం లేదు..’ అని ట్వీట్ చేశాడు.
కొత్త రూల్ ప్రకారం.. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాటర్ స్ట్రైకింగ్ కు వెళ్లాలి. ఇన్నాళ్లు ఇలా ఔటైతే సదరు బ్యాటర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఎంసీసీ ఈ నిబంధనను మార్చింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశపెట్టనున్నారు.
అంతకుముందే దీనిని ఇటీవలే ఇంగ్లాండ్ లో ముగిసిన ‘ది హండ్రెడ్’ లీగ్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో కూడా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్మీ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ నిబంధన వల్ల బౌలర్లకు... ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో బౌలర్లకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త బ్యాటర్.. బౌలర్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే అవకాశముంది. బ్యాటు-బాల్ కు సమన్వయం ఉండేందుకే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్టు క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
కాగా.. 2014లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నీషమ్ కు ఇది నాలుగో సీజన్. 2014 లో అతడు ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడాడు. ఆ తర్వాత 2020 లో పంజాబ్ తరఫున, 2021 లో ముంబై ఇండియన్స్ కు ఆడాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడనున్నాడు.