- Home
- Sports
- Cricket
- ఇస్తాంబులా..! అబ్బే, అలాంటిదేమీ లేదే.. అది మా చర్చలోకే రాలేదు.. ఐపీఎల్ వేదిక మార్పుపై అరుణ్ ధుమాల్ స్పష్టత
ఇస్తాంబులా..! అబ్బే, అలాంటిదేమీ లేదే.. అది మా చర్చలోకే రాలేదు.. ఐపీఎల్ వేదిక మార్పుపై అరుణ్ ధుమాల్ స్పష్టత
IPL 2023 Auction: ఐపీఎల్ -16 కోసం బీసీసీఐ త్వరలో నిర్వహించనున్న వేలం ప్రక్రియకు సంబంధించిన మీడియాలో వస్తున్న కథనాలపై కాబోయే ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలం వేదికపై కూడా ఆయన స్పష్టతనిచ్చాడు.

ఇండియన్ ప్రీమియరర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత సీజన్ (2023) వేదికగా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ను బీసీసీఐ ఖరారు చేసిందని వస్తున్న వార్తలపై త్వరలో ఐపీఎల్ కు కొత్త చైర్మెన్ గా ఎంపిక కాబోతున్న అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశాడు. అసలు అది తమ చర్చలోకే రాలేదని వెల్లడించాడు. ఆసియా నెట్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Arun Dhumal
అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘అసలు ఈ సమాచారానికి మూలం ఏమిటో నాకైతే తెలియదు. ఇది పూర్తిగా అసంబద్ధం. మేము (బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి) ప్రస్తుతం తర్వాత వేలం జరిగే తేదీల గురించి చర్చిస్తున్నాము. వేదిక గురించి ఇంతవరకు చర్చనే జరగలేదు. ఇస్తాంబుల్ అనేది మా చర్చలోకి రానే లేదు...’ అని స్పష్టం చేశాడు.
ఇదిలాఉండగా రెండ్రోజుల క్రితం ఐపీఎల్ వేలం ప్రక్రియను బీసీసీఐ ఎప్పుడూ నిర్వహించే బెంగళూరులో కాకుండా ఇస్తాంబుల్ లో నిర్వహించాలని చూస్తున్నదని.. ఈ లీగ్ కు ప్రపంచ స్థాయి క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదని వార్తలు వచ్చాయి.
కానీ ఇస్తాంబుల్ తో భారత్ కు అంత ఆరోగ్యకరమైన ద్వైపాక్షిక సంబంధాలేమీ లేవు. ఇటీవల లుఫ్తాన్సా - బెంగళూరు విమానాన్ని ఇస్తాంబుల్ కు మళ్లించారు. అక్కడి ఎయిర్ పోర్టు అధికారులు యూఎస్ఎ, ఇతర దేశాల పాస్ పోర్ట్ హోల్డర్స్ ను విమానాశ్రయంలోకి అనుమతించినా భారతీయులను మాత్రం అందుకు నిరాకరించారు.
అంతేగాక భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేస్తున్న డిజిటల్ ఆర్మీకి టర్కీ సహకరించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఐపీఎల్ వేలం నిర్వహించే అవకాశాలే లేవని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఐపీఎల్-16 కోసం డిసెంబర్ 16న బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహించునన్నట్టు సమాచారం. ఈమేరకు వేదిక, వేలం ప్రక్రియ, రిటెన్షన్, ఇతర వివరాలకు సంబంధించిన వివరాలన్నీ నవంబర్ మొదటివారంలో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.