సురేశ్ రైనాకి ముంబైలోని నిబంధనల గురించి తెలీదు... స్నేహితుడి ఆహ్వానంతోనే...
ముంబైలో కోవిద్ నిబంధనలను ఉల్లంఘించి, ప్రవర్తించిన కారణంగా భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్టైన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్పోర్టుకి సమీపంలోని ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్లో రాత్రి పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు... రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్లో క్రికెటర్ సురేశ్ రైనాతో పాటు సింగర్ గురు రంధవా సహా 34 మందిని అరెస్టు చేశారు.
సురేశ్ రైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, అరెస్టు కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. బెయిల్పై విడుదలైన సురేశ్ రైనా, అసలు ముంబైకి ఎందుకెళ్లాడనేదానిపై క్లారిటీ ఇచ్చింది సురేశ్ రైనా మేనేజ్మెంట్ టీమ్.
‘సురేశ్ రైనా ఓ షూట్ కోసం ముంబైకి వచ్చారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఓ ఫ్రెండ్ పిలవడంతో డిన్నర్కోసం వెళ్లారు.
అయితే ముంబైలో అమలులో ఉన్న నిబంధనల గురించి కానీ, టైమింగ్స్ గురించి కానీ రైనాకి తెలీదు. విషయం తెలుసుకున్న తర్వాత అధికారులతో సహకరించి, అనుకోకుండా చేసిన తప్పుకి క్షమాపణలు తెలిపారు...
ఆయన ఎప్పుడూ నియమ నిబంధనలు పాటిస్తారు... చట్టవ్యతిరేకంగా, న్యాయ విరుద్ధంగా నడుచుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు...
జరిగిన దానికి నిండు హృదయంతో క్షమాపణలు కోరిన సురేష్ రైనా... భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపారు’ అని తెలియచేసింది సురేశ్ రైనా మేనేజ్మెంట్.
ముంబైలో జరిగిన రైడ్స్లో సురేశ్ రైనాతో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసాన్నే ఖాన్ కూడా ఈ రైడ్స్లో అరెస్టు అయ్యారు...