సూర్యకుమార్ భవితవ్యం ఏమిటి..? తేల్చేసిన టీమిండియా కెప్టెన్..
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్ లోనే అత్యంత క్షీణదశను ఎదుర్కుంటున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో వరుసగా మూడుసార్లూ డకౌట్ అయ్యాడు.

టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలలో మాత్రం ఆ మ్యాజిక్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అతడు ఆడిన మూడింటిలోనూ ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
వన్డేలలో అత్యంత చెత్త ఆటతీరుతో వరుసగా విమర్శలు ఎదుర్కుంటున్న సూర్యను ఈ ఫార్మాట్ లో ఆడించడం వేస్ట్ అని, అతడి స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకుంటే మంచిదని చాలారోజులుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆసీస్ తో సిరీస్ తర్వాత ఈ కామెంట్స్ చేసేవాళ్లు మరింత పెరిగారు.
ఈ నేపథ్యంలో సూర్యను వన్డే టీమ్ ల నుంచి తప్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వరుస వైఫల్యాలలో ఉన్న సూర్యకు రోహిత్ మద్దతుగా నిలిచాడు. ఈ సిరీస్ లో సూర్య ఆడిందే మూడు బంతులని, ప్రస్తుతం అతడు గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడని తెలిపాడు.
రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ లో సూర్య మూడు మ్యాచ్ లలో మూడు బంతులే ఆడాడు. తొలి రెండు మ్యాచ్ లలో సూర్య ఔట్ అయిన రెండు బంతులు కొంచెం కష్టతరమైనవే. కానీ మూడో వన్డేలో మాత్రం సూర్య ఔట్ అవడం ఆశ్చర్యంగా అనిపించింది. సూర్య స్పిన్ బాగా ఆడగలడు. వారిపై ఆధిపత్యం చెలాయించడమెలాగో అతడికి బాగా తెలుసు. గత కొన్నిరోజులుగా మనం ఇది చూస్తున్నాం...’అని చెప్పాడు.
సూర్యను లోయరార్డర్ లో పంపడానికి గల కారణాలను వివరిస్తూ.. ‘ఆఖరి ఓవర్లలో బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటాడని సూర్యను లోయరార్డర్ లో పంపాం. కానీ దురదృష్టవశాత్తూ సూర్య విఫలమయ్యాడు. ప్రస్తుతం అతడు తన కెరీర్ లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. అయితే ప్రతీ క్రికెటర్ కూ ఇలాంటి పరిస్థితులు సహజం. మూడు సార్లు డకౌట్ అయినంత మాత్రానా సూర్య ప్రభ తగ్గినట్టు కాదు..’అని తెలిపాడు.
ఇదిలాఉండగా తొలి రెండు వన్డేలలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లలో ఆడిన తొలి బంతికే ఔటైన సూర్య.. నిన్నటి మ్యాచ్ లో ఆస్టన్ అగర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల ఛేదనలో భారత్.. 248 వద్దే ఆగిపోయి సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది.