Virender Sehwag: 43వ పడిలోకి అడుగిడుతున్న నజఫ్గడ్ నవాబ్.. సెహ్వాగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?
Happy Birthday Virender Sehwag: భారత క్రికెట్ (Team India) లో బెస్ట్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన సెహ్వాగ్ .. తన మెరుపు బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 90వ దశకంలో పుట్టిన పిల్లలకు సెహ్వాగ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్.
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (virender sehwag) ఇవాళ 43 వ బర్త్ డే సెలబ్రేట్ (Happy Birthday Virender Sehwag) చేసుకుంటున్నాడు. భారత క్రికెట్ (Team India) లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన సెహ్వాగ్ .. తన మెరుపు బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 90వ దశకంలో పుట్టిన పిల్లలకు సెహ్వాగ్ అంటే క్రేజ్. అతడు బ్యాటింగ్ లో ఉన్నంతసేపు టీవీ చూసి.. అనంతరం టీవీ కట్టేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా వీర బాదుడు బాదే వీరేంద్రుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
1978 అక్టోబర్ 20న హర్యానాలో జన్మించిన సెహ్వాగ్.. చిన్నప్పట్నుంచే క్రికెట్ తో ప్రేమలో పడ్డాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే సెహ్వాగ్ కు అమితమైన అభిమానం. తన అభిమాన క్రికెటర్ లాగే తాను కూడా క్రికెట్ లో ఎదగాలని భావించిన సెహ్వాగ్.. సచిన్ మాదిరే చిన్న వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు.
12 ఏండ్ల వయసులో క్రికెట్ ఆడుతుండగా బంతి బలంగా తాకడంతో సెహ్వాగ్ పన్ను విరిగింది. ఇతరులైతే భయంతోనో మరే కారణంతోనో క్రికెట్ ను వీడేవారు. కానీ సెహ్వాగ్ మాత్రం అలా చేయలేదు.
సెహ్వాగ్.. 1999 లో పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ సందర్భంగా భారత జట్టుకు అరంగ్రేటం చేశాడు. 2001లో సౌత్ ఆఫ్రికాతో టెస్టు జట్టులోకి వచ్చాడు.
టెస్టు లలో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ సెహ్వాగ్. కెరీర్ లో మొత్తం 104 టెస్టులు, 251 వన్డేలు, 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన వీరూ.. మొత్తంగా 17 వేల పరుగులు చేశాడు.
ఇక సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డుల్లో కొన్ని.. ఆధునిక క్రికెట్ లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందిన వీరూ.. టెస్టు, వన్డేలలో 1000 బౌండరీలు సాధించిన రెండో భారత ఆటగాడు.
భారత్ తరఫున అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు సొంతం చేసుకున్న వారిలో సచిన్, గంగూలీ తర్వాత సెహ్వాగ్ ఉన్నాడు. వీరూ.. 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.
డాన్ బ్రాడ్మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ తర్వాత టెస్టు క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ సెహ్వాగ్. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ (270 బంతుల్లోనే) సాధించాడు.
అంతర్జాతీయ కెరీర్ లో సెహ్వాగ్ పరుగులు ఇలా ఉన్నాయి. 104 టెస్టులాడిన వీరూ.. 8586, వన్డేలలో 8273 పరుగులు చేశాడు. వన్డేలలో 96 వికెట్లు, టెస్టులలో 40 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీ, పంజాబ్ తరఫున ఆడిన సెహ్వాగ్.. 104 మ్యాచ్ లలో 2,728 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 155.4 కావడం విశేషం.
ఇక వ్యక్తిగత జీవితానికొస్తే.. సెహ్వాగ్ చిన్నప్పట్నుంచి అల్లరివాడు. తల్లిదండ్రులతకు మూడో సంతానం అయిన వీరూ.. పాఠశాలకు వెళ్లే రోజుల్లో నాటకాలు వేసేవాడు. హిందీ పాటలు వినే అలవాటున్న అతడు.. కిషోర్ కుమార్ పాటలంటే చెవి కోసుకుంటాడు. బ్యాటింగ్ చేస్తూ కూడా పాటలు పాడేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నజాఫ్గఢ్ నవాబ్ కు తన తల్లి చేసే ఖీర్ (పాయసం) అంటే ఎంతో ఇష్టం.
సెహ్వాగ్.. తన బంధువు అయిన ఆర్తి తో చిన్నప్పట్నుంచే స్నేహం ఉంది. వీరూకు 21 ఏండ్లున్నప్పుడు అతడు.. ఆర్తికి తను లవ్ గురించి చెప్పాడు. దానికి ఆమె కూడా కాదనలేకపోయింది. 2004లో వీరి వివాహం జరిగింది.
వీరూకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ఆర్యవీర్. రెండో కొడుకు వేదాంత్. పిల్లలంటే వీరూకు చాలా ప్రేమ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక అతడు.. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. ఇక సెహ్వాగ్ నెలకొల్పిన సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలను ఆర్తి చూస్తున్నది.
గ్రౌండ్ లో ప్రత్యర్థుల బంతులను చీల్చి చెండాడే సెహ్వాగ్.. సోషల్ మీడియాలో కూడా అదే రీతిలో పోస్టులు పెడతాడు. తనదైన శైలిలో కౌంటర్్ ఇవ్వడంలో సెహ్వాగ్ తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. సున్నితమైన విషయాల మీద కూడా సెహ్వాగ్ .. ఎవర్నీ నొప్పించకుండా ఫన్ జనరేట్ అయ్యేలా చేసే పోస్టులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.