'డబుల్ సెంచరీ చేశాక ఈ డిబేట్ ఎందుకు..? రోహిత్తో ఓపెనర్గా అతడే కరెక్ట్.. కెఎల్ రాహుల్, ధావన్లకు నో ఛాన్స్’
వన్డేలలో ఇన్నాళ్లు రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసేవాడు. కానీ కొంతకాలంగా ధావన్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దీంతో టీ20ల మాదిరిగానే రోహిత్ - రాహుల్ జోడీని వన్డేలలో ఆడించాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ..
ఈ ఏడాది స్వదేశంలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా ప్రణాళికలు ఉండనున్నాయి. ఇందులో భాగంగానే ప్రధానంగా జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి సారించింది. అయితే భారత్ కు మిడిలార్డర్ లో సమస్య లేకపోయినా ఓపెనింగ్ జోడీగా ఎవరిని పంపించాలి..? అన్నదానిపై స్పష్టత రావడం లేదు.
వాస్తవానికి వన్డేలలో ఇన్నాళ్లు రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసేవాడు. కానీ కొంతకాలంగా ధావన్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దీంతో టీ20ల మాదిరిగానే రోహిత్ - రాహుల్ జోడీని వన్డేలలో ఆడించాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనవరకైతే అసలు ఈ చర్చే అవసరం లేదని.. వన్డేలలో కూడా ఇషాన్ కిషన్ రోహిత్ కు జోడీగా రావాలని అన్నాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ టీవీ చర్చలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ ఇటీవలే బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేశాడు. అదీ వాళ్ల సొంతగడ్డపై.. ఈ సిరీస్ లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డా.. మూడో వన్డేలో 35వ ఓవర్లోనే ఇషాన్ డబుల్ పూర్తయింది. ఇంతకు మించి ఏం కావాలి..? వన్డేలలో రోహిత్ కు జతగా ఇషాన్ కిషనే ఉండాలి.
ఇషాన్ ఓపెనర్ బ్యాటర్ గానే గాక వికెట్ కీపర్ గా కూడా సేవలందించగలడు. ఇంకేం కావాలి..? అతడు డబుల్ సెంచరీ చేసిన తర్వాత నా వరకైతే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ ముగిసింది..’ అని చెప్పాడు. మరి వచ్చే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా తుది జట్టును గురించి కూడా గంభీర్ కామెంట్స్ చేశాడు.
‘రోహిత్ - ఇషాన్ లు ఓపెనింగ్ చేయాలి. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడాలి. నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలి. గత ఏడాదిన్నర కాలంగా అయ్యర్ వన్డేలలో నిలకడగా ఆడుతున్నాడు. అయ్యర్ తర్వాత ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా ఉండాలి..’ అని చెప్పాడు. తన టాప్ - 6 లో కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ల పేర్లు లేకపోవడం గమనార్హం. కెఎల్.. ఇషాన్ కు బ్యాకప్ కీపర్, బ్యాటర్ గా ఉండాలని గంభీర్ చెప్పాడు.
kl rahul
గంభీర్.. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెంటార్ గా ఉండగా, ఆ జట్టుకు కెఎల్ రాహుల్ సారథిగా ఉన్నాడు. అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు కెప్టెన్ గా ఉన్న రాహుల్ ను సైతం గంభీర్ పక్కనబెట్టడం గమనార్హం.