- Home
- Sports
- Cricket
- నా ముందు మంచిగా నటించి వెనకాల గోతులు తీశారు.. ఆసీస్ సారథిపై మాజీ హెడ్కోచ్ షాకింగ్ కామెంట్స్
నా ముందు మంచిగా నటించి వెనకాల గోతులు తీశారు.. ఆసీస్ సారథిపై మాజీ హెడ్కోచ్ షాకింగ్ కామెంట్స్
ఆస్ట్రేలియాకు మూడేండ్ల పాటు హెడ్ కోచ్ గా పనిచేసిన జస్టిన్ లాంగర్ ఆ జట్టు సారథి, ఇతర ఆటగాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ముందు బాగా నటించి వెనకాల గోతులు తీశారని వాపోయాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, 2018 తర్వాత జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడైన జస్టిన్ లాంగర్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పలుమార్లు వన్డే ప్రపంచకప్ లు గెలిచిన ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్ లేని లోటును లాంగర్ తీర్చాడు.
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అసలు అంచనాలే లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ట్రోఫీ ఎగురేసుకుపోయింది. దీని వెనుక ఆసీస్ ఆటగాళ్ల కష్టంతో పాటు హెడ్ కోచ్ లాంగర్ పాత్ర కూడా ఉంది.
టీ20 విజేతలు అయ్యాక స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను మట్టికరపించి 4-0తో ఆసీస్ విజయం సాధించడంలో కూడా లాంగర్ పాత్ర ఎంతో ఉంది. ఇంత చేసినా ఈ ఏడాది క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని తొలగించి ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను ఫుల్ టైమ్ కోచ్ గా నియమించింది. అయితే తనను తొలగించడం వెనుక ప్రస్తుత ఆసీస్ టెస్టు, వన్డే సారథి ప్యాట్ కమిన్స్ తో పాటు మరికొంతమంది హస్తముందని లాంగర్ వాపోయాడు.
డైలీ మెయిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాంగర్ మాట్లాడుతూ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవాళ్లు పిరికివాళ్లు. కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించారు. కానీ నా వెనకే గోతులు తవ్వారు. నా గురించి, జట్టు గురించి బోర్డు వద్ద ఉన్నదీ లేనదీ కలిపి చెప్పారు.
నా హయాంలోనే ఆసీస్ ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించింది. అయితే దానిని ఎంజాయ్ చేసే మూడ్ లో నేను లేదు. ఇది చాలా కష్టంగా అనిపించింది. నన్ను అకారణంగా కోచ్ పదవి నుంచి తప్పించారు. కోచ్ కు ఆటగాళ్లకు చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. కానీ వ్యక్తుల స్వలాభం కోసం ఇలా చేయడం మాత్రం తప్పు’ అని కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఆసీస్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనకు ముందు లాంగర్ ను బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను నియమించింది. కానీ ఇటీవలే స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కంగారూలు కనీసం సెమీస్ కు కూడా చేరకపోవడం గమనార్హం.