వరుసగా మూడు డకౌట్లు.. ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో’ అంటూ సూర్యపై గవాస్కర్ కామెంట్స్
Suryakumar Yadav: తన కెరీర్ లో అత్యంత చెత్త ఫామ్ తో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలలోనూ డకౌట్ అయ్యాడు.

ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేలలోనూ దారుణ వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. మూడు వన్డేలలోనూ ఎదుర్కున్న తొలి బంతికే ఔట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. దీంతో సూర్య.. కేవలం టీ20లకే సరిపోతాడని, వన్డేలకు పనికిరాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20లలో అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలూ అందుకునే సూర్య.. వన్డేలలో ఇలా ఆడటం అందరినీ ఆశ్చర్యానిక గురి చేస్తున్నది. అయితే తాజాగా సూర్య ఆటపై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సూర్య ఇక ఐపీఎల్ ఆడుకోవడం బెటర్ అని సన్నీ అన్నాడు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిసిన తర్వాత గవాస్కర్ మాట్లాడుతూ... ‘సూర్య మూడు వన్డేలలో డకౌట్ అవడం బాధాకరమే. కానీ అతడు తెలుసుకోవాల్సిన విషయమేంటంటే ఇది ఏ ఆటగాడి కెరీర్ లో అయినా జరిగేదే. దీని గురించి ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్.
మూడు గోల్డెన్ డకౌట్స్ గురించి మరిచిపోయి త్వరలో జరుగబోయే ఐపీఎల్ మీద దృష్టిపెట్టాలి. ఐపీఎల్ లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అది అతడికి తర్వాత ఆడబోయే అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎంతో అవసరమవుతుంది.
ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ తో కూడా వన్డేలు ఆడాల్సి ఉంది. ఇవన్నీ వరల్డ్ కప్ ఈయర్ లోనే జరుగుతున్నాయి కావున అతడు దానిని దృష్టిలో ఉంచుకుని తన గేమ్ ను తీర్చిదిద్దుకోవాలి.. అలాగైతేనే సూర్య వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదిస్తాడు...’అని తెలిపాడు. గవాస్కర్ తో పాటు టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా సూర్యకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
కాగా రిషభ్ పంత్ కు రోడ్డు ప్రమాదం, శ్రేయాస్ అయ్యర్ కు వెన్నునొప్పి కారణంగా సూర్యకు పదే పదే అవకాశాలు దక్కతున్నాయి. అయినా కూడా అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 23 వన్డేలు ఆడిన సూర్య.. 24 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. గడిచిన పది వన్డే ఇన్నింగ్స్ లలో కలిపి 100 పరుగులు కూడా చేయలేకపోయాడు.