రోహిత్ శర్మ రనౌట్ తర్వాత భయమేసింది... ఇదే చివరి మ్యాచ్ అనుకున్నా... క్రిస్ లీన్ కామెంట్...
2021 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన క్రిస్ లీన్, ఆరంభ మ్యాచ్లో 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి అవుటైన విషయం తెలిసిందే. అయితే క్రిస్ లీన్ చేసిన పొరపాటు కారణంగా రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు.
15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
క్రిస్ లీన్ స్థానంలో డి కాక్ లేదా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే, కెప్టెన్ కోసం తమ వికెట్ సమర్పించేవారు...
మొదటి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ లీన్, ఆ పని చేయకపోవడంతో బాగా డిస్సపాయింట్ అయినట్టు కనిపించాడు రోహిత్ శర్మ.. అయితే రోహిత్ అవుటైన తర్వాత బౌండరీలతో విరుచుకుపడి, ముంబై తరుపున హై స్కోరర్గా నిలిచాడు క్రిస్ లీన్...
‘రోహిత్ శర్మ రనౌట్ తర్వాత భయమేసింది... ఎందుకంటే ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్. రోహిత్తో కలిసి బ్యాటింగ్ చేయడం కూడా ఇదే మొదటిసారి...
అందుకే పరిస్థితి అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. రోహిత్ శర్మ రనౌట్ తర్వాత ఇదే నా ఆఖరి మ్యాచ్ అవుతుందేమోనని భయమేసింది...
అయితే ఆటలో ఇవన్నీ సర్వసాధారణం. రోహిత్ శర్మ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోహిత్ శర్మ ఉండి ఉంటే కచ్ఛితంగా మా స్కోరు మరింత మెరుగ్గా ఉండేది’ అంటూ కామెంట్ చేశాడు క్రిస్ లీన్...
గత సీజన్లో క్రిస్ లీన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. 2020 సీజన్లో 15 మంది ప్లేయర్లను వాడిన ముంబై ఇండియన్స్, క్రిస్ లీన్కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు...
2021 సీజన్ ఆరంభానికి ముందు డి కాక్, పాక్ సిరీస్ కారణంగా ఇండియాకి లేటుగా వచ్చాడు. దీంతో అతను క్వారంటైన్లో ఉన్నాడు. డి కాక్ స్థానంలో క్రిస్ లీన్కి అవకాశం దక్కింది...
క్రిస్ లీన్ మొదటి మ్యాచ్లో 49 పరుగులు చేయడంతో డి కాక్ స్థానంలో అతన్ని కొనసాగిస్తారా? లేక పాత ఓపెనింగ్ జోడినే తిరిగి తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది...