రోహిత్ శర్మ ఈ పరిస్థితికి భారత జట్టులో ‘కుళ్లు’ రాజకీయాలే కారణమా? విరాట్తో విభేదాలే...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే గత ఏడాది కాలంగా వినిపిస్తున్న వార్త. తాజాగా ఆస్ట్రేలియా టూర్కి జట్టును ప్రకటించినప్పుడు ఎంపిక కాని రోహిత్ శర్మ... ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత క్రికెట్ జట్టులో రాజకీయాలు తారాస్థాయికి చేరాయనే చర్చ నడుస్తోంది. బీసీసీఐ పక్షపాత ధోరణిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు అభిమానులు.
ఐపీఎల్లో గాయపడిన సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధమాన్ సాహా... ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్కి ఎంపికయ్యాడు. రోహిత్, ఇషాంత్లతో పోలిస్తే సాహా గాయం పెద్దదే.
అయితే భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియాకి పయనమైన వృద్ధమాన్ సాహా, ఫిజియోల పర్యవేక్షణలో ఆస్ట్రేలియాలో చికిత్స తీసుకుంటున్నాడు..
మరోవైపు తాను ఫిట్గా ఉన్నానంటూ ఐపీఎల్లో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్లోనే బరిలో దిగాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ ఇంకా నూరుశాతం ఫిట్నెస్ సాధించలేదని అతన్ని పొట్టిఫార్మాట్ నుంచి పక్కనబెట్టింది బీసీసీఐ.
రోహిత్ శర్మ గాయం నుంచి 70 శాతం కోలుకున్నాడని స్వయంగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రకాటించాడు. ఎన్సీఏలో శిక్షణ తర్వాత 80 శాతం రికవరీ అయ్యాడని రిపోర్ట్.
మరి 80 శాతం కోలుకున్న రోహిత్ శర్మను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి, అక్కడ ఫిజియో పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా... అనేది ‘హిట్ మ్యాన్’ అభిమానుల ప్రశ్న.
టెస్టు సిరీస్లో పాల్గొనాలంటే వెంటనే ఆస్ట్రేలియా రావాలని రోహిత్, ఇషాంత్ శర్మలకు వార్నింగ్ ఇచ్చాడు కోచ్ రవిశాస్త్రి. 14 రోజుల క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని ముందే తెలిసినప్పుడు ఇద్దరికీ జట్టుతో పాటే ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
దీనికి అంతటికీ బీసీసీఐ స్వార్థ రాజకీయాలే కారణమని ఆరోపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. జట్టులో విరాట్ కోహ్లీకి దక్కుతున్న గౌరవం, మిగిలిన ప్లేయర్లకు దక్కడం లేదనేది రోహిత్ శర్మ ఆవేదన అని చాలామందికి తెలిసిన విషయమే.
అదీకాకుండా బీసీసీఐ ఫిజియో ఫిట్నెస్ సాధించాలంటే విశ్రాంతి అవసరమని చెప్పినా, వినకుండా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరుపున బరిలో దిగడంతో అతనిపై రవిశాస్త్రి అండ్ కో కోపంగా ఉన్నారట.
అంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విబేధాలు కూడా ‘హిట్ మ్యాన్’లాంటి బ్యాట్స్మెన్పై వివక్ష చూపించడానికి కారణం అంటున్నారు అతని అభిమానులు.
రోహిత్ శర్మ ఫిట్గా లేనప్పుడు ఆ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేరని మరికొందరు వాదన. రోహిత్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఫిట్గా ఉన్నానని, టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నానంటూ ప్రకటించాడు. ఇప్పుడు ఫిజియో రిపోర్ట్ వేరేగా ఉంది.
ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు తన ఫిట్నెస్ గురించి క్లారిటీ ఉండదా? తాను క్రికెట్ ఆడగలనో, లేదో చెప్పలేడా? అంటూ నిలదీస్తున్నారు మరికొందరు. గాయంతో బాధపడుతుంటే ఐపీఎల్ ఫైనల్లో హాఫ్ సెంచరీ ఎలా చేయగలడని ప్రశ్నిస్తున్నారు.
విరాట్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ వంటి స్టార్లు లేకుండా టీమిండియా టెస్టులో ఏ మాత్రం ప్రదర్శన ఇస్తుందోనని అభిమానులు కంగారుపడుతున్నారు.
ఆసీస్ టూర్లో టీమిండియా విఫలమైతే, రోహిత్ శర్మ గాయంతో మొదలైన వివాదం మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత జట్టు విజయాలు అందుకుంటే మాత్రం రోహిత్ శర్మ గాయం రేపిన చిచ్చును కూడా అందరూ మరిచిపోతారు.