టీమిండియాలో నాలా బ్యాటింగ్ చేసేవాళ్లు లేరు.. కానీ వాళ్లిద్దరు మాత్రం.. : సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virender Sehwag: టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత అటువంటి బ్యాటర్ కోసం భారత జట్టు ఎదురుచూస్తూనే ఉన్నా ఆ స్థాయి హిట్టర్ ను అందించలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు ఓపెనర్, టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించిన జట్టులోని సభ్యుడిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత ట మళ్లీ జట్టు ఆ స్థాయి ఓపెనర్ ను తయారుచేయలేకపోయింది. తాజాగా వీరూ కూడా ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బ్యాటర్లలో తనలా ఆడేవాళ్లు ఎవరూ లేరని చెప్పాడు.
ఓ జాతీయ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ వీరూ ఈ కామెంట్స్ చేశాడు. ‘ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బ్యాటర్లలో ఎవరూ నా మాదిరి బ్యాటింగ్ చేయలేరు. అయితే కొంచెం నా బ్యాటింగ్ ను సరిపోల్చే ఇద్దరు ఆటగాళ్లు పృథ్వీ షా, రిషభ్ పంత్.
టెస్టు క్రికెట్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్, దూకుడు నా ఆటను పోలి ఉంటుంది. కానీ అతడు 90, 100 లతోనే సంతృప్తి పడతాడు. నేను అలా కాదు. బరిలోకి దిగితే మినిమం డబుల్ సెంచరీ, 250, 300 బాదాలని ఫిక్స్ అవుతా. ఒకవేళ పంత్ కూడా అలాగే ఆలోచిస్తే అతడు ఫ్యాన్స్ ను మరింత అలరించేవాడవుతాడు..’అని తెలిపాడు.
ఇక తొంబైలలో ఉండగా తనకు సింగిల్స్ తీయడం కంటే ఫోర్, సిక్సర్ బాదితేనే త్వరగా పని అయిపోయేదని, తాను ఆ మైండ్ సెట్ తోనే ఉంటానని వీరూ చెప్పుకొచ్చాడు. ‘నేను టెన్నిస్ బాల్ క్రికెట్ బాగా ఆడేవాన్ని. అప్పుడు నేను ఎక్కువగా బౌంరడీలు బాదడానికే ఆసక్తి చూపేవాడిని. అదే ఆటను నేను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడాను.
సెంచరీ చేయడానికి ఎన్ని బౌండరీలు కావాలని నేను లెక్కలు వేసుకుని ఆడేవాడిని. నేను 90 పరుగుల వద్ద ఉండగా సెంచరీ చేరడానికి పది బంతులు ఆడితే పది పరుగులు వస్తే శతకం అవుతుంది అని ఆలోచించేదానికిటే రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ కొడితే పని అయిపోద్దిగా అనుకునేవాడిని. ట్రిపుల్ సెంచరీ వద్ద ఉన్నప్పుడు కూడా నా మైండ్ సెట్ ఇదే విధంగా ఉండేది. అప్పుడు రిస్క్ పర్సంటేజీ 100 శాతం నుంచి 20 శాతానికి తగ్గుతుంది కదా..’అని చెప్పుకొచ్చాడు.
ఇక ముల్తాన్ టెస్టులో వీరూ ట్రిపుల్ సెంచరీ చేసినప్పటి మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ముల్తాన్ టెస్టులో నేను వంద పరుగుల మార్కును చేరడానికి ఆరు సిక్సర్లు కొట్టాను. ఆ టైమ్ లో సచిన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పుడు సచిన్ నాతో.. ‘నువ్వు మళ్లీ సిక్సర్ కొడితే బ్యాట్ తో కొడతా’అని నన్ను బెదిరించాడు. దీంతో నేను 120 నుంచి 295 పరుగుల మధ్యలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. కానీ 295 వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొడతానని సచిన్ తో చెప్పాను.
అప్పుడు సచిన్ నాతో.. ‘నీకేమైనా పిచ్చా..?’ భారత్ తరఫున ఎవరూ ట్రిపుల్ సెంచరీ చేయలేదు. నీకు ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు దానిని పాడు చేసుకుంటావా..? అని మందలించాడు. అప్పుడు నేను ఎవరూ 295 కూడా కొట్టలేదు కదా అని బదులిచ్చాను. ఆ మరుసటి బంతికే సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి ట్రిపుల్ సెంచరీ చేశాను. నేను ట్రిపుల్ సెంచరీ చేసినందుకు నాకన్నా సచిన్ ఎక్కువ సంతోషించాడు..’అని తెలిపాడు.