INDvsENG: టీమిండియాకి అనుకూలంగా థర్డ్ అంపైర్ నిర్ణయాలు... రోహిత్ అవుట్ అయినా...
థర్డ్ అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జో రూట్....
వివాదాస్పదంగా మారుతున్న థర్డ్ అంపైర్ నిర్ణయాలు...
డీఆర్ఎస్లో ఉన్న లోపాలను టీమిండియా వాడుకుంటోందా... లేక అంపైరింగ్ లోపమా?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు ఎదురైన అనుభవమే, ప్రస్తుతం భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ఎదుర్కుంటోంది. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా రెండు రివ్యూ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
తొలి ఇన్నింగ్స్లో అజింకా రహానే అవుట్ విషయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రహానే అవుట్ కోసం అప్పీలు చేయగా బ్యాటుని తాకిన తర్వాత బంతి గ్లవ్స్కి తాకుతున్న విషయాన్ని థర్డ్ అంపైర్ గమనించలేదు.
థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించిన తర్వాత టీవీ రిప్లైలో బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాతి మూడు బంతులకే అవుట్ అయ్యాడు అజింకా రహానే. తప్పిదాన్ని గుర్తించిన థర్డ్ అంపైర్, ఇంగ్లాండ్కి కోల్పోయిన రివ్యూని వెనక్కి ఇచ్చాడు.
రెండో ఇన్నింగ్స్లోనూ ఇలాంటి అనుభవమే ఎదురైంది జో రూట్ అండ్ టీమ్కి. మొయిన్ ఆలీ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కోసం అప్పీలు చేసింది ఇంగ్లాండ్. అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో రివ్యూ తీసుకున్నారు.
రిప్లైలో రోహిత్ బ్యాటుకి బంతి తగులుతున్నట్టు కనిపించకపోవడంతో నాటౌట్గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. అయితే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవుతున్నట్టు కనిపించింది. జో రూట్ కేవలం క్యాచ్ అవుట్కి అప్పీలు చేశాడని భావించిన థర్డ్ అంపైర్, దాన్ని మాత్రమే గమనించి నిర్ణయాన్ని ప్రకటించాడు.
దాంతో ఎల్బీడబ్ల్యూ అవుట్ నుంచి తప్పించుకున్నాడు రోహిత్. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు జో రూట్. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.