జోఫ్రా ఆర్చర్కి గాయం... టీమిండియాతో రెండో టెస్టుకి దూరమైన స్టార్ పేసర్...
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, భారత్తో జరిగే రెండో టెస్టుకి దూరమయ్యాడు. ఆర్చర్ మోచేతికి గాయం కావడంతో రెండో టెస్టులో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లను స్వల్ప స్కోర్లకే అవుట్ చేశాడు ఆర్చర్.
తొలి ఇన్నింగ్స్లో 21 ఓవర్లలో 75 పరుగులిచ్చిన జోఫ్రా ఆర్చర్, ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. రెండో ఇన్నింగ్స్లో ఆఖరి వికెట్గా బుమ్రాను పెవిలియన్ చేర్చి, టీమిండియాను ఆలౌట్ చేశాడు ఆర్చర్. ఇషాంత్ బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు ఆర్చర్.
‘జోఫ్రా ఆర్చర్ టీమిండియాతో చెన్నైలో జరిగే రెండో టెస్టును మిస్ కావచ్చు. ప్రస్తుతం అతను కుడి మోచేతి గాయంతో బాధపడుతున్నాడు...’ అంటూ ట్వీట్ చేసింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు...
మొదటి టెస్టులో టీమిండియాపై 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అనంతరం ఆర్చర్ గాయానికి చికిత్స చేయించినట్టు సమాచారం. మోచేతి వద్ద ఇబ్బందిగా అనిపించడంతో అతనికి ఇంజక్షన్ చేశారు. దాని ప్రభావంతో రెండో టెస్టులో పాల్గొనడం లేదు ఆర్చర్.
ఇప్పటికే ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్కి రెండో టెస్టులో విశ్రాంతిని ఇస్తామని ప్రకటించింది ఇంగ్లాండ్. అతని స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ ఆడతాడని స్పష్టం చేసింది. 38 ఏళ్ల జేమ్స్ అండర్సన్ తొలి ఇన్నింగ్స్ రెండు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్లో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయానికి కారణమయ్యాడు.
రెండో టెస్టులో పాల్గొనకపోయినా అహ్మదాబాద్లో జరిగే మూడో టెస్టు సమయానికి జోఫ్రా ఆర్చర్ కోలుకుని, బరిలో దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఆర్చర్ అందుబాటులో ఉండకపోవడంతో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఇద్దరూ బరిలో దిగే అవకాశం ఉంది.
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న స్టువర్ట్ బ్రాడ్, మూడో స్థానంలో ఉన్న అండర్సన్ బరిలో దిగితే, రెండో టెస్టులో భారత బ్యాట్స్మెన్ మరింత ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి 1-0 తేడాతో సిరీస్లో ఆధిక్యం సంపాదించింది ఇంగ్లాండ్.