ఇంతకుముందు అందరూ సచిన్, ధోనీ, కోహ్లీ అనేవారు, ఇప్పుడు ట్రెండ్ మారింది... మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ..
2007కి ముందు క్రికెట్ అంటే ఇష్టపడే ఏ యువకుడిని, కుర్రాడిని అడిగినా తాను సచిన్ టెండూల్కర్లా అవుతానని చెప్పేవాడు. ఆ తర్వాత ఆ లిస్టులోకి మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వచ్చారు. అయితే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలతో సమానంగా బౌలర్లకి కూడా క్రేజ్ వస్తోందని అంటున్నాడు లక్ష్మీపతి బాలాజీ...
‘ఇంతకుముందు 10లో 9 మంది కుర్రాళ్లు తాము పెద్దయ్యాక ఏ సచిన్ టెండూల్కర్ లేదా ఎమ్మెస్ ధోనీ, లేదా ఓ విరాట్ కోహ్లీలా అవ్వాలని ఆశపడేవాళ్లు. కానీ ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, లేదా జహీర్ ఖాన్లా అవ్వాలని కోరుకుంటున్నారు.
క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ల ప్రాధాన్యం అంతలా పెరిగింది. ఇప్పుడు భారత జట్టులో కూడా వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా బుమ్రా పేస్, షమీ మోడ్రన్ డే స్కిల్స్, ఇషాంత్ శర్మ సుదీర్ఘ అనుభవం భారత జట్టుకి ఎన్నో విజయాలను అందిస్తోంది.
ఇప్పుడు భారత జట్టులో ఉన్నవారిలో షమీ, బుమ్రా చాలా నైపుణ్యం ఉన్న పేసర్లు. ఈ ఇద్దరిలో ఒక్కరిని కచ్ఛితంగా ఆడించాల్సిందే. అలాగే ఇషాంత్ శర్మ వయసుకి గౌరవం ఇచ్చి, అతనికి రొటేషన్ పద్ధతిలో అవకాశం ఇస్తే బెటర్...
అలాగే టీమిండియాకి ఇప్పుడు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ల రూపంలో చాలా మంది అద్భుతమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు.
జట్టులో చోటు కోసం ఆరోగ్యకరమైన పోటీ ఉండడం చాలా అవసరం. అప్పుడే పేసర్లు కూడా తమ ప్రతిభను చూపించడానికి కసితో ఆడతారు. ఫాస్ట్ బౌలర్లు సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించాలంటే వారికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం...
తమిళనాడులో ఓ చిన్న కుగ్రామం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి ఎదిగాడు నటరాజన్. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ స్థానానికి నట్టూ కరెక్ట్ ఛాయిస్.
భారత జట్టు దగ్గర వేరియేషన్స్, ఎలివేషన్స్ చూపించే బౌలర్లు సమృద్ధిగా ఉండడం వల్లే టీమిండియాలో టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టగలుగుతోంది... ఇప్పుడు భారత బౌలింగ్ విభాగం కొన్నాళ్ల పాటు ఇలాగే కొనసాగుతుంది.
భారత జట్టు పేస్ విభాగం ఇంత బలంగా మారడానికి 1980ల్లో రోల్ మోడల్స్గా నిలిచిన కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగళ్ శ్రీనాథ్ వంటి లెజెండ్స్ కారణం. 1980,90ల్లో భారత బౌలర్లు చూపించిన పర్ఫామెన్స్ కారణంగానే యువకుల్లో బౌలింగ్పైన దృష్టి పెట్టాలనే ఆసక్తి కలిగింది.
గత ఐదారేళ్లలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువమంది పేసర్లే ఉన్నారు. మూడు ఫార్మాట్లలో బౌలర్లకు అనేక అవకాశాలు దక్కుతున్నాయి. మంచి పర్ఫామెన్స్ చూపిస్తే చాలు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
1980,90ల్లో జట్టులో ఇద్దరు ముగ్గురు పేసర్లు మాత్రమే ఉండడం వల్ల మిగిలిన వారికి పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. రొటేషన్ పాలసీ కారణంగా ఇప్పుడు చాలామంది యువకులకు అవకాశాలు దక్కుతున్నాయి.... దీనికి ఐపీఎల్ కూడా ఓ కారణం’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, పేసర్ లక్ష్మీపతి బాలాజీ.
భారత జట్టు తరుపున 8 టెస్టులు, 30 వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడిన లక్ష్మీపతి బాలాజీ, మొత్తంగా 71 వికెట్లు తీశాడు. ఇంతకుముందు కేకేఆర్కి బౌలింగ్ కోచ్గా వ్యవహారించిన బాలాజీ, ప్రస్తుతం సీఎస్కేకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు.