- Home
- Sports
- Cricket
- జాతీయ జట్టుకు ఆడాలంటే అవి ఆడాల్సిందే.. క్రికెటర్లకు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక ఆదేశాలు..?
జాతీయ జట్టుకు ఆడాలంటే అవి ఆడాల్సిందే.. క్రికెటర్లకు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక ఆదేశాలు..?
Afghanistan Cricket: ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శనలతో జట్టుగా గుర్తింపు పొందుతున్న ఆఫ్ఘానిస్థాన్.. దేశపు క్రికెట్ అభివృద్ధిలో కీలకమైన అంశాన్ని బలోపేతం చేయాలని కంకణం కట్టుకుంది.

క్రికెట్ లో పసికూన స్థాయి నుంచి ఏ దేశాన్నైనా ధీటుగా ఎదుర్కునే స్థితికి వచ్చిన జట్టు ఆఫ్ఘానిస్థాన్. తనదైన స్పిన్, పేస్ బౌలర్లతో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆ జట్టు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.
అయితే టీ20లలో విజయవంతమైన జట్టుగా ఉన్న ఆఫ్ఘాన్.. క్రికెట్ లో అసలైన మజాను పంచే వన్డేలు, టెస్టులలో మాత్రం అంత బలంగా లేదు. టెస్టు హోదా దక్కిన తర్వాత ఇప్పటివరకు 6 టెస్టులు మాత్రమే ఆడిన ఆ దేశం.. ఇక నుంచి ఆ సంఖ్యను పెంచాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే దేశవాళీ టోర్నీలను ఎక్కువగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
అయితే ఇందుకు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ). టెస్టు జట్టులో ఎంపిక కావాలంటే దేశవాళీలో కచ్చితంగా ఆడాల్సిందేనని కొత్తగా నిబంధలను తీసుకురానున్నది.
దీని ప్రకారం.. ఆఫ్ఘాన్ తరఫున టెస్టులు ఆడాలనుకునే క్రికెటర్లంతా కచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో ఆడాలి. లేకుంటే వాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోరు.
ఇదే విషయమై ఏసీబీకి కొత్తగా అధ్యక్షుడిగా ఎంపికైన మిర్వాయిస్ అష్రఫ్ స్పందిస్తూ... ‘ఏ దేశంలో అయినా దేశవాళీ క్రికెట్ ఎంతో ముఖ్యం. మేము కూడా ఆఫ్ఘాన్ లో దేశవాళీ క్రికెట్ ను బలంగా తయారుచేయాలనుకుంటున్నాం. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ కు పోటీ పడాలని మేము కోరుకుంటున్నాం. అలా చేయాలంటే ఆటగాళ్లంతా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి..’ అని తెలిపాడు.
ఇక నెలకో లీగ్ అంటూ వివిధ దేశాలలో బిజీ ప్లేయర్ గా ఉన్న రషీద్ ఖాన్ ను కూడా దేశవాళీ ఆడమంటారా..? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఒకవేళ అతడు ఖాళీగా ఉంటే అతడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడతాడు..’ అని చెప్పాడు.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ కూడా తనకు లీగ్ ల కంటే జాతీయ జట్టే ముఖ్యమని చెప్పిన విషయం తెలిసిందే.
గతంలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ లు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేవాళ్లని ఏసీబీ తెలిపింది. కాగా.. దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను బలోపేతం చేయడానికి గాను ఆఫ్ఘాన్ లో ప్రొవిన్షియల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పోటీలను నిర్వహించనున్నారు.
భారత్ లో రంజీలు, విజయ్ హజారే ట్రోఫీ, సూపర్ లీగ్ ల మాదిరిగానే మూడు రోజుల మ్యాచులు, వన్డే మ్యాచులు, టీ20 లీగ్ లను స్థానికంగా నిర్వహించేందుకు ఆఫ్ఘాన్ బోర్డు ప్రణాళికలు రచిస్తున్నది.