- Home
- Sports
- Cricket
- బీసీసీఐ నిర్ణయం భేష్.. అక్కడ సక్సెస్ అయినప్పుడు ఇక్కడెందుకు కాదు? వన్డే కెప్టెన్సీ మార్పుపై వెంగ్సర్కార్
బీసీసీఐ నిర్ణయం భేష్.. అక్కడ సక్సెస్ అయినప్పుడు ఇక్కడెందుకు కాదు? వన్డే కెప్టెన్సీ మార్పుపై వెంగ్సర్కార్
Virat Kohli: టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మార్పు పై భారత సీనియర్లు తలో మాట మాట్లాడుతున్నారు. కొందరేమో ఇది మంచి నిర్ణయమే అంటే మరికొంతమందేమో విరాట్ ను బలి చేయడం మంచిది కాదని అంటున్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా కెప్టెన్సీ మార్పుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై సీనియర్లు ఎవరికి వారు తోచినవిధంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది సరైనదే అంటుంటే మరికొందరేమో ఇది పనికిమాలిన నిర్ణయం అంటూ తిట్టి పోస్తున్నారు.
నిన్న ఇదే విషయమ్మద మాజీ ఆల్ రౌండర్ మదన్ లాల్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై ఫైర్ అయ్యాడు. విరాట్ విజయాలు సాధిస్తున్నా అతడిని తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాడు. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ కచ్చితంగా విముఖత చూపి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఇదే విషయమై భారత మాజీ క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్సర్కార్ స్పందించారు. కోహ్లీ నుంచి వన్డే పగ్గాలు రోహిత్ శర్మకు అప్పజెప్పడం మంచి నిర్ణయమే అని అన్నారు. రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డాడు.
దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత సారథిగా రోహిత్ శర్మను నియమించి బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది. ఆ అవకాశం కోసం అతడు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇది మంచి నిర్ణయంగానే నేను భావిస్తున్నాను.
ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ పూర్తిగా టెస్టు లపై దృష్టి కేంద్రీకరించగలడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ మీద దృష్టి పెడతాడు. ఆ ఫార్మాట్ లో అతడు చాలా బాగా ఆడుతున్నాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న అతడు.. ఆ జట్టుకు ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు. అంతేగాక భారత జట్టుకు కెప్టెన్ అవకాశం వచ్చిన ప్రతిసారి అతడు తనను తాను బాగా నిరూపించుకున్నాడు...’ అని వెంగ్సర్కార్ అన్నాడు.
భారత జట్టులో రెండు గ్రూపులున్నాయనే ఆరోపణల మీద వెంగ్సర్కార్ స్పందించాడు. ‘భారత డ్రెస్సింగ్ రూమ్ లో రెండు గ్రూపులు లేవనే నేను భావిస్తున్నాను. జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వాళ్లు తమకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..’ అని సూచించాడు.
ఇక స్ప్లిట్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘క్రికెట్ లో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు సారథులు ఉండటం కొత్తేమీ కాదు. ఇంగ్లాండ్ లో టెస్టు జట్టుకు, వన్డే, టీ20 జట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. అయినా ఇంగ్లాండ్ ప్రపంచ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నది. టెస్టు జట్టుకు రూట్.. వన్డే, టీ20 లకు ఇయాన్ మోర్గాన్ సారథులుగా ఉన్నా ఆ జట్టు బాగా రాణిస్తుంది. ఇది భారత జట్టులో కూడా వర్కవుట్ అవుతుందని నేను భావిస్తున్నాను..’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తప్పించి రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై మహ్మద్ అజారుద్దీన్ కూడా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ‘విరాట్ తర్వాత టీమిండియా వన్డే, టీ20 ల కొత్త సారథి రోహిత్ శర్మపై నాకు చాలా ఆశలున్నాయి. అతడికి జట్టును నడింపించే సామర్థ్యముంది. కొత్త కెప్టెన్ కు నా అభినందనలు..’అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.