‘లోయరార్డర్లో బ్యాటింగ్కు వచ్చి ఐదు వేల పరుగులంటే మాటలా..? ధోని రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యం..’
IPL 2023: తన కెరీర్ లో చివరి ఐపీఎల్ (?) ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే ఈ లీగ్ లో ఐదు వేల పరుగుల ఘనతను పూర్తి చేసుకున్నాడు.
ఓపెనర్ గా బరిలోకి దిగో లేక మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు సాధించడం కొంతమంది స్టైల్ అయితే మిడిలార్డర్ లో గానీ లోయరార్డర్ లో గానీ బ్యాటింగ్ కు వచ్చి ఐపీఎల్ వంటి మెగా లీగ్ లో ఐదు వేల పరుగులు చేయడం అంతా ఆషామాషీ కాదంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఐపీఎల్ లో రెండ్రోజుల క్రితం చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన సీఎస్కే - లక్నో మ్యాచ్ లో ఆడిన మూడు బంతుల్లోనే 12 పరుగులు చేయడంతో చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఈ లీగ్ లో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్ గా.. తొలి వికెట్ కీపర్ బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.
Image credit: PTI
ధోని ఈ రికార్డు సాధించిన తర్వాత సెహ్వాగ్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఈ మైల్ స్టోన్స్ గురించి మీరు ఎంఎస్ ధోనిని అడిగితే వీటివల్ల కొత్తగా మారేది ఏమీ లేదని చెబుతాడు. ధోని 5 వేలు, మూడు వేలు, ఏడు వేల పరుగులు వంటివి ఎన్ని రికార్డులు సాధించినా అతడి టార్గెట్ మాత్రం ఒక్కటే. అదే టైటిల్ నెగ్గడం..
అది కూడా ధోని ఈ లీగ్ లో ఇదివరకే నాలుగుసార్లు చేసి చూపించాడు. దాని ముందు ధోని ఈ మైల్ స్టోన్స్ గురించి పట్టించుకోడు. నేను కూడా ధోని టైపే. ఈ నెంబర్ల గురించి ఎవరు పట్టించుకుంటారు. ఒక ఆటగాడు రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ వారి ఘనతలని ఆటగాళ్లు, అభిమానులు అనుకుంటారు.
అయితే ధోని మాత్రం మిడిలార్డర్, లోయారార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి ఈ రికార్డు సాధించడం అనేది గొప్ప విషయం. నాకు తెలిసి ఏ ప్లేయర్ కూడా ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఇన్ని పరుగులు చేయడు. అతడి నిలకడ, ఆట పట్ల అతడికున్న నిబద్ధతకు ఇది నిదర్శనం..’అని చెప్పాడు.
కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో ధోని కంటే ముందు ఆరుగురు బ్యాటర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ (6,706), శిఖర్ ధావన్ (6,284), డేవిడ్ వార్నర్ (5,974), రోహిత్ శర్మ (5,880), సురేశ్ రైనా (5,528), ఏబీ డివిలియర్స్ (5,162) లు ముందున్నారు. ధోని.. 236 మ్యాచ్ లలో 208 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చి 5,004 పరుగులు సాధించాడు.