ఆ తప్పు చేసినప్పుడు ధోని వారం రోజుల దాకా నిద్రపోయేవాడు కాదు : రాబిన్ ఊతప్ప
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని పై ఆ జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ తొలి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులుగా ఉన్న ఎంఎస్ ధోని, రాబిన్ ఊతప్పలు మంచి మిత్రులు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా ఈ ఇద్దరూ కలిసి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఊతప్ప గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.
రాబోయే సీజన్ లో ఊతప్ప ఐపీఎల్ లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. జియో సినిమాస్ ద్వారా ప్రసారం కాబోతున్న ఐపీఎల్ - 16 లో ఊతప్ప కామెంటేటర్ గా చేస్తాడని ఇదివరకే హింట్స్ కూడా వచ్చాయి. తాజాగా అతడు జియో సినిమాస్ లో జరిగిన ఓ చర్చలో తన సారథి ధోనిపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.
ఊతప్ప మాట్లాడుతూ... ‘ధోని పదునైన వ్యూహాలు కలిగి ఉంటాడు. అందుకే అతడిని అందరూ సక్సెస్ఫుల్ కెప్టెన్ అంటారు. తన నుంచి వచ్చే ప్రతి నిర్ణయానికి అతడే బాధ్యత వహిస్తాడు. అది విజయమైనా ఓటమైనా ధోని పూర్తి బాధ్యత తీసుకుంటాడు.
ఒకవేళ ధోని నిర్ణయం వల్ల ఫలితం ఏదైనా తేడా కొడితే అతడికి నిద్ర పట్టదు. దానిమీదే ఆలోచిస్తూ గడపుతుంటాడు. ఒక విజయవంతమైన కెప్టెన్ తన తప్పుడు నిర్ణయాలపై నాలుగైదు సార్లు ఆలోచిస్తాడనుకుంటే ధోని మాత్రం.. కనీసం 8 నుంచి 9 సార్లు ఉంటుంది. అంత ఆలోచిస్తాడు కాబట్టే అతడు సక్సెస్ఫుల్ సారథి అయ్యాడు...’అని ఊతప్ప చెప్పాడు.
కాగా మార్చి 31 నుంచి మొదలుకాబోయే సీజన్ కోసం ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనికి ఇదే చివరి సీజన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాలని ధోని భావించినా పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. గత సీజన్ లో చెన్నై దారుణ ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో ఈసారి తిరిగి పుంజుకోవాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. తన చివరి మ్యాచ్ చెపాక్ (చెన్నై) లోనే ఆడతానని ధోని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-16లో చెన్నై.. తమ తొలి మ్యాచ్ ను గుజరాత్ జెయింట్స్ తో ఆడనుంది.