అండర్ -19 కెప్టెన్లంటే వాళ్లకు అదో తుర్తి.. ఒక్క విరాట్ తప్ప అందరూ ఢిల్లీకే..
WPL Auction: సోమవారం ముంబై వేదికగా ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ జట్టు మరోసారి అండర్ - 19 కెప్టెన్ నే నమ్ముకుంది.

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ టైటిల్ ను దక్కించుకోలేదు. అయినా కూడా ఆ టీమ్ కు క్రేజ్, కావాల్సినంత గ్లామర్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. 2020లో ఒకసారి ఫైనల్ వరకూ చేరినా తర్వాతి సీజన్లలో విఫలమవుతున్నది. అతిరథ మహామహులు సారథులుగా వ్యవహరించిన ఈ టీమ్ కు ఓ ప్రత్యేకత ఉంది.
సోమవారం ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఢిల్లీ.. టీమిండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మను రూ. 2 కోట్ల ధరతో దక్కించుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.2కోట్లు) తర్వాత ఆ టీమ్ ఓ ఇదే హయ్యస్ట్ బిడ్. కాగా షెఫాలీని దక్కించుకోవడం ద్వారా ఢిల్లీ ఓ ఘనతను దక్కించుకుంది.
ఇప్పటివరకు భారత జట్టు తరఫున అండర్ - 19 ప్రపంచకప్ లో సారథ్యం వహించినవారిలో ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగిలినవారంతా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడినవారే కావడం గమనార్హం. కోహ్లీ అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతడిని వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. అప్పట్నుంచీ అతడు బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. మిగిలినవారి జాబితాను ఓసారి చూద్దాం.
కోహ్లీ తర్వాత అండర్ - 19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన సారథి ఉన్ముక్త్ చంద్ ను ఢిల్లీ 2011లో దక్కించుకుంది. 2011 నుంచి 2013 వరకూ ఢిల్లీకి ఆడాడు. ఆ తర్వాత అతడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండిన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
ఉన్ముక్త్ తర్వాత పృథ్వీ షా వంతు. గత నాలుగు సీజన్లుగా షా ఢిల్లీకి ఆడుతున్నాడు. 2018లో షా.. అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షా ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగమయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలో అతడే కీలక ఆటగాడు.
చంద్, షా ల తర్వాత అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన యశ్ ధుల్ ను కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది. ధుల్.. గతేడాది వెస్టిండీస్ వేదికగా ముగిసిన అండర్ - 19 వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు సారథి. ఆ తర్వాత కొద్దిరోజులకే జరిగిన వేలంలో ధుల్ ను కోటి రూపాయలు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఇక తాజాగా షెఫాలీ కూడా ఢిల్లీకే ఆడనుంది. షెఫాలీ సారథ్యంలోని అండర్ - 19 భారత మహిళల జట్టు.. జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ను సాధించిన విషయం తెలిసిందే.