- Home
- Sports
- Cricket
- శార్దూల్తో పాటు మరో ఇద్దరికి గుడ్ బై చెప్పనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. రూ. 15 కోట్లు మిగిల్చుకునేలా ప్లాన్..?
శార్దూల్తో పాటు మరో ఇద్దరికి గుడ్ బై చెప్పనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. రూ. 15 కోట్లు మిగిల్చుకునేలా ప్లాన్..?
T20 World Cup 2022: వచ్చే ఐపీఎల్ సీజన్ సందడి ఇప్పుడే మొదలైంది. వచ్చే నెలలో ఐపీఎల్ - 16 కోసం మినీ వేలం నిర్వహణకు బీసీసీఐ చురుకుగా ఏర్పాట్లు చేస్తుండగా ఫ్రాంచైజీలు కూడా అందుకు సమాయత్తమవుతున్నాయి.

Image credit: Getty
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మీద దృష్టి నిలిపింది. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు మాత్రం అంతకుమించిన పనిని పెట్టుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పట్నుంచే పనులు మొదలుపెట్టాయి.
IPL Trophy
2023 ఐపీఎల్ కోసం డిసెంబర్ 16న ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా బీసీసీఐ వేలం నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నది. వేదిక విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ తేదీ మాత్రం అదేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే వేలాని కంటే ముందు ఫ్రాంచైజీలు మరో పని చేయాల్సిన పని ఉంది. నవంబర్ 15 వరకు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వదిలేసే క్రికెటర్ల జాబితాను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పని ప్రారంభించింది. గత వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు గుడ్ బై చెప్పాలని చూస్తున్నది. శార్దూల్ తో పాటు ఆంధ్రా వికెట్ కీపర్ కెఎస్ భరత్, బ్యాటర్ మన్దీప్ సింగ్ లను కూడా వదిలించుకోవాలని భావిస్తున్నది.
గత వేలంలో ఢిల్లీ.. శార్దూల్ ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ - 15 సీజన్ లో శార్దూల్ 14 మ్యాచ్ లలో 15 వికెట్లు తీశాడు. బౌలింగ్ ఎకానమీ 10గా ఉండగా సగటు 31.5గా ఉంది. అడపాదడపా వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చుకున్నాడు.
Image Credit: Instagram
బౌలర్ గా విఫలమైన శార్దూల్ బ్యాటర్ గా కూడా పెద్దగా రాణించలేదు. ఈ సీజన్ లో అతడు 120 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సందర్భాల్లో అనవసరపు షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో శార్దూల్ వల్ల జట్టుకు ఒనగూరింది ఏమీ లేదని భావించిన ఢిల్లీ యాజమాన్యం ఈ సీజన్ లో అతడిని వదిలించుకోవాలని చూస్తున్నది.
శార్దూల్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ ను రూ. 2 కోట్లకు దక్కించుకోగా మన్దీప్ సింగ్ ను రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది. రిషభ్ పంత్ జట్టులో ఉండగా మరో వికెట్ కీపర్ అవసరం లేదని ఢిల్లీ యాజమాన్యం భావిస్తున్నది. గత సీజన్ లో భరత్ కు పెద్దగా ఆడే అవకాశాలు కూడా రాలేదు. మన్దీప్ సింగ్ మూడు మ్యాచ్ లలో 18 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ ముగ్గురిని విడుదల చేస్తే ఢిల్లీకి సుమారు రూ. 14 కోట్లపైనే తిరిగి పర్స్ లో చేరతాయి. ఈ అమౌంట్ తో ప్రతిభ కలిగిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలని ఢిల్లీ మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది. ఇందుకు సంబంధించిన వివరాలపై నవంబర్ 15 తర్వాత స్పష్టత రానున్నది.